‘నాతో మాట్లాడటానికే భయపడింది.. కానీ’

17 Oct, 2020 18:40 IST|Sakshi

అమ్మాయిల వెంట తిరిగే పోకిరీ అనుకుంది

అమ్మ చొరవతోనే ఇదంతా జరిగింది

ఆదిత్య నారాయణ్‌

ముంబై: ‘‘మా అమ్మ చొరవ తీసుకున్నందు వల్లే శ్వేత నాతో మాట్లాడింది. నాతో కలిసి భోజనం చేసింది. మొదట్లో నన్ను అపార్థం చేసుకున్నా.. ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంది. నాతో జీవితం పంచుకోవడానికి ఓకే చెప్పినందుకు తనకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా’’ అంటూ కాబోయే భార్యపై ప్రేమను చాటుకున్నాడు ఆదిత్య నారాయణ్‌. ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడిగానే గాకుండా నటుడు, సింగర్‌, హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు ఆదిత్య. మొదటి సినిమా షాపిత్‌ షూటింగ్‌ సమయంలో సహనటి శ్వేత అగర్వాల్‌తో ప్రేమలో పడిన అతడు, త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నాడు. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో తమ వివాహం జరుగబోతున్నట్లు ఆదిత్య ఇటీవల స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాల పెద్దల అంగీకారంతోనే తాము వైవాహిక బంధంలో అడుగుపెట్టబోతున్నట్లు పేర్కొన్నాడు.(చదవండి: ఈ ఏడాది చివర్లో శ్వేతతో నా పెళ్లి: నటుడు)

ఈ నేపథ్యంలో ప్రేమ ప్రయాణంలో జరిగిన సంఘటనల గురించి ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘ నిజానికి దాన్ని ఫస్ట్‌డేట్‌ అనాలో వద్దో కూడా తెలియదు. షాపిత్‌ సెట్లో శ్వేతతో మాట కలిపాను. ఆ తర్వాత నాతో పాటు లంచ్‌కు రమ్మని పిలిచాను. కానీ అప్పటికే నాకున్న బ్యాడ్‌ ఇమేజ్‌, స్త్రీలోలుడు అనే దుష్ప్రచారం కారణంగా శ్వేత నాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. దూరందూరంగానే ఉంది. అప్పుడు మా అమ్మ వచ్చి, తన దగ్గరకు వెళ్లి మాట్లాడింది. ‘‘ఇద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారు.. కలిసి భోజనం చేయడం తప్పేమీ కాదు’’అని చెప్పింది. (త్వరలో పెళ్లి.. రూ.18 వేలే ఉన్నాయి)

దాంతో శ్వేత మనసు కాస్త మెత్తబడింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఓ రెస్టారెంటుకు వెళ్లి భోజనం చేశాం. అలా మా మధ్య మొదలై, ప్రేమకు దారితీసింది. నేనే ముందు ప్రపోజ్‌ చేశాను. కానీ తను చాలా భయపడింది. ఆ తర్వాత మెల్లగా నా కుటుంబ సభ్యులతో పరిచయమైన తర్వాత నా గురించి పూర్తిగా తెలుసుకుంది. నేనొక ఫ్యామిలీ మ్యాన్‌ అనే విషయం అర్థమైన తర్వాత పెళ్లికి అంగీకరించింది. నేను అమ్మాయిల వెంట తిరిగే పోకిరి అని ఎవరో చెప్పారట. తన భయంలో కూడా అర్థం ఉందిగా. ఇప్పుడు మా మధ్య ఎలాంటి రహస్యాలు, భయాలు లేవు’’అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు