ఉత్తమ నటుడిగా హీరో ఆదిత్య ఓంకు అవార్డు

14 Apr, 2022 18:42 IST|Sakshi

నటుడు, డైరెక్టర్‌ ఆదిత్య ఓం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ బయటపెట్టారు.తాజాగా జరిగిన రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా ఆదిత్య ఓం అవార్డు గెలుచుకున్నారు. 

'దహ్నం'. ఈ సినిమాలో బ్రాహ్మణ పూజారిగా ఆయన నటనకు గాను ప్రశంసలతో పాటు అవార్డ్స్ దక్కాయి.రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రతిష్టాత్మక ఎనిమిది ఎడిషన్లలో ప్రాంతీయ చలనచిత్ర విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు ఆదిత్య ఓం. ఈ గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణధీర్ కపూర్ వంటి దిగ్గజాలకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అందించారు.

మరోవైపు ఆదిత్య ఓంకు ముంబైలోని ప్రైమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ  ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. దీంతో ఆనందంలో మునిగిపోయిన ఆదిత్య ఓం.. తాను మళ్లీ మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఈ అవార్డులు ఎంతగానో దోహదపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక 'దహ్నం' చిత్రానికి రచన, దర్శకత్వం వహించిన మూర్తి అడారికి కూడా బెస్ట్‌ డైరెక్టర్‌గా అవార్డు లభించింది.

మరిన్ని వార్తలు