దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది: పూజా హెగ్డే

25 Mar, 2021 00:20 IST|Sakshi

దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది హీరోయిన్ పూజా హెగ్డే తమిళ సినిమా చేసి. మిస్కిన్ దర్శకత్వంలో జీవా హీరోగా నటించిన తమిళ చిత్రం ‘ముగముడి’ (2018) (తెలుగులో ‘మాస్క్‌’గా అనువాదమైంది) తర్వాత పూజా మరో తమిళ సినిమాలో నటించలేదు. ఇప్పుడు ఓ సినిమాకి సైన్ చేశారు. నెల్సన్ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా సన్ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారు. ‘స్వాగతం పూజా’ అంటూ బుధవారం ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

మార్చి రెండో వారంలో పూజా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇక పూజా హెగ్డే  తెలుగులో నటించిన ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో రణ్‌వీర్‌సింగ్‌ ‘సర్కస్‌’, సల్మాన్ ఖాన్ ‘కబీ ఈద్‌ కబీ దీవాళి’ సినిమాల్లో పూజ నటిస్తోంది. ఇలా ఉత్తర, దక్షిణ సినీ పరిశ్రమలను బ్యాలెన్స్‌ చేస్తూ కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచేసుకుంటున్నారు పూజా హెగ్డే.

మరిన్ని వార్తలు