లేడీ సూపర్ స్టార్ నయనతార తర్వాత ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్న నటి ఎవరంటే ఐశ్వర్యరాజేష్ అని చెప్పవచ్చు. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డ్రైవర్ జమున’. 18 రీల్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి వత్తికుచ్చి చిత్రం ఫేమ్ కింగ్స్ లిన్ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత రవీందర్, ధరెంతంటే!
ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి ఐశ్వర్యరాజేష్ మాట్లాడుతూ.. డ్రైవర్ జమున చిత్రం తనకు చాలా స్పెషల్ అన్నారు. కింగ్స్ లిన్ ప్రతిభావంతుడైన దర్శకుడని, ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని చెప్పారు. ఈ చిత్రం తరువాత ఆయనకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నానన్నారు. ఇందులో క్యాబ్ డ్రైవర్గా నటించిన తాను ఫైట్స్, రిస్కీ సన్నివేశాలను డూప్ లేకుండా నటించానని చెప్పారు.
చదవండి: వామ్మో! ‘అవతార్ 2’ తెలుగు రైట్స్కు అన్ని కోట్లా?
తనకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అని, ఈ చిత్రంలో 70 శాతం కార్ డ్రైవింగ్ సన్నివేశాలే ఉంటాయని తెలిపారు. దీంతో ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నటించానని తెలిపారు. ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లోనే నటిస్తున్నట్లు ఉన్నారు అన్న ప్రశ్నకు ఐశ్వర్యరాజేష్ బదులిస్తూ అలా ప్లాన్ చేసి నటించడం లేదని, వచ్చిన అవకాశాల్లో మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు చెప్పారు. అలాగని హీరోల చిత్రాల్లో నటించనని చెప్పడం లేద న్నారు. అలాగే తెలుగు తదితర ఇతర భాషలో నటిస్తున్నా, ప్రస్తుతానికి తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నట్లు ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు.