వైవిధ్య భరిత కథా పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటి ఐశ్వర్య రాజేష్. తమిళంతో పాటు తెలుగులో కూడా గట్టిగా తన సత్తాను చాటుకుంటున్న ఈ నటి తాజాగా ట్యాక్సీడ్రైవర్ అవతారమెత్తారు. డ్రైవర్ జమున అనే చిత్రంలో నటి ఐశ్వర్యరాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 18 రీల్స్ పతాకంపై డాక్టర్ ఎస్పీ చౌదరి నిర్మిస్తున్నారు. వత్తికుచ్చి వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కిన్స్ లిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు ఉగాది సందర్భంగా మంగళవారం చెన్నైలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ కథ వినగానే ఇందులో నటించడానికి ఐశ్వర్య రాజేష్ వెంటనే అంగీకరించారని తెలిపారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ కాల్ టాక్సీ డ్రైవర్గా నటిస్తున్నట్లు చెప్పారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి టాక్సీ డ్రైవర్గా నటించనున్నారనగానే డ్రైవర్ జమున చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయని నిర్మాత ఎస్వీఎస్ చౌదరి తెలిపారు.