Aishwarya Rajinikanth: ధనుష్‌తో విడాకుల తర్వాత.. మెగాఫోన్‌ పట్టడానికి రెడీ అవుతున్న ఐశ్వర్య

24 Sep, 2022 13:00 IST|Sakshi

తమిళ సినిమా: తలైవా వారసురాళ్లు మరోసారి మెగా ఫోన్‌ పట్టడానికి సిద్ధం అవుతున్నారు. రజనీకాంత్‌ ఇద్దరు కూమార్తెలు సినీ దర్శకురాళ్లే. నటుడు ధనుష్‌ను పెళ్లి చేసుకున్న ఐశ్వర్య ఆయన హీరోగా 2012లో 3 అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. అదే చిత్రంతో నటి శృతిహాసన్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌కు కూడా ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం సక్సెస్‌ అనిపించుకోకపోయినా వై దిస్‌ కొలవెరి డి పాటతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2014లో వై రాజా వై అనే చిత్రాన్ని ఐశ్వర్య తెరకెక్కించారు.

అలాగే 2017లో సినీ స్టంట్‌ కళాకారుల ఇతివృత్తంతో సినివ వీరన్‌ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఇక నటుడు ధనుష్, ఐశ్వర్యల పెళ్లి, విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. భార్య నుంచి విడిపోయిన ధనుష్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి ఐశ్వర్య రజనీకాంత్‌ ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశమైంది. కాగా ఐశ్వర్య రజనీకాంత్‌ సుమారు ఐదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.

ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్‌ కూడా తన తండ్రి కథానాయకుడిగా కొచ్చడైయాన్‌ అనే చారిత్రక కథా చిత్రాన్ని యానిమేషన్‌ ఫార్మేట్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు