ఆ ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తాడట..అజయ్‌ భూపతి ట్వీట్‌ వైరల్‌

7 Oct, 2021 15:37 IST|Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రోజుకో వివాదం చోటు చేసుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు ప్యానళ్ల సభ్యులు పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు. మొదట్లో కేవలం​ సంస్థాగతంగా విమర్శించుకున్న నటులు.. ప్రస్తుతం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు ప్యానల్‌ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. విమర్శలు, వాదనలు, ఆరోపణలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో  ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ సెన్సేషన్‌గా మారింది.‘నాకు నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా..' అని అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడని పేర్కొంటూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు అజయ్‌.  దానికి 'మా' ఎలక్షన్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు.

మరో ట్వీట్‌లో ‘ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది.ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన "మహాసముద్రం’ రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి’ అని కామెంట్‌ చేశాడు. దీంతో ఈ రెండు ట్వీట్లు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే అజయ్ భూపతితో అలాంటి కామెంట్ చేసిన సదరు డైరెక్టర్ ఎవరి వర్గం అనేది స్పష్టత లేదు. 

మరిన్ని వార్తలు