మరోసారి గొప్ప మనసు చాటుకున్న అక్షయ్‌ కుమార్‌

25 Apr, 2021 19:52 IST|Sakshi

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అక్ష‌య్ కుమార్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. మరోసారి కరోనా వైరస్‌ నివారణకు విరాళం ప్రకటించి రీల్ లైఫ్‌లోనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లో హీరో కూడా‌ అనిపించుకుంటున్నారు. కష్టకాలంలో ఆయ‌న ఎన్నోసార్లు కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. క్లిష్టపరిస్థితుల్లో త‌న వంతు సాయం చేస్తూ ప్ర‌జ‌ల‌కు, ప్రభుత్వానికి అండ‌గా నిలుస్తున్నారు. గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలో కూడా ఆయన భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా కరోనా సెకండ్‌ వేవ్‌లో సైతం ఆయన స్వచ్చందంగా ముందకు వచ్చారు. కరోనా వైర‌స్ నియంత్ర‌ణకు దేశంలో ఆక్సిజన్‌ కొరత తీర్చేందు కోసం మాజీ క్రికేటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఆధ్వర్యంలో న‌డుస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌కు ఆయన కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా గౌతమ్‌ గంభీర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా గంభీర్ త‌న స్వ‌చ్చంధ సంస్థ‌కు అక్షయ్‌ రూ. కోటి విరాళం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

‘అక్ష‌య్ ఇచ్చింది డ‌బ్బులు మాత్ర‌మే కాదు, ఎంద‌రో జీవితాల‌కు భ‌రోసాను క‌ల్పించారు. మీరు ఇచ్చిన డ‌బ్బును మా ఫౌండేష‌న్ ద్వారా ఆక్సీజన్, ఆహరం​ ,మెడిసిన్ వంటివి అవ‌ర‌స‌ర‌మైన వారి కోసం వినియోగిస్తాం అక్షయ్‌’ అంటూ రాసుకొచ్చారు. ఇక గంభీర్ ట్వీట్‌పై అక్ష‌య్ కూడా స్పందిస్తూ.. ‘క‌ఠిన‌మైన ఈ స‌మ‌యంలో సాయం చేయ‌డం నా వంతు బాధ్యత. ఈ సంక్షోభం నుండి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డ‌తామని ఆశిస్తున్నా’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఇటీవల అక్ష‌య్ కుమార్ సైతం క‌రోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు.

చదవండి: 
అందుకే 7 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు బ్రేకప్‌ చెప్పా: త్రిశాలా 
ఒళ్లంతా చెమ‌ట‌లు, ఆ క్ష‌ణం చ‌చ్చిపోతున్నా అనుకున్నా

మరిన్ని వార్తలు