అక్షయ్‌ ఊసరవెల్లి

30 Nov, 2020 00:41 IST|Sakshi

టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతుండటం తెలిసిందే. తెలుగు చిత్రాలను బాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించడంలో హీరో అక్షయ్‌ కుమార్‌ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే పలు టాలీవుడ్‌ చిత్రాల రీమేక్‌లో నటించిన ఆయన తాజాగా మరో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్‌. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊసరవెల్లి’. 2011లో విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారని సమాచారం.

ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ చూసిన అక్షయ్‌ కుమార్‌ ఫిదా అయ్యి, హిందీలో రీమేక్‌ చేయాలనుకుంటున్నారట.కాగా ఇప్పటికే ‘టిప్స్‌’ అనే సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కులు కొనుగోలు చేసిందట.. ప్రస్తుతం బాలీవుడ్‌కి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్‌. అయితే ఈ సంస్థ నిర్మించే చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయంపై క్లారిటీ లేదు. మరి ‘టిప్స్‌’ సంస్థ నిర్మించే చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ నటిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. కాగా ఇప్పటికే తెలుగులో హిట్‌ అయిన ‘అల వైకుంఠపురములో, ఇస్మార్ట్‌ శంకర్, ఛత్రపతి’ సినిమాలు తాజాగా బాలీవుడ్‌లో రీమేక్‌ కానున్నాయి.

మరిన్ని వార్తలు