క్రేజీ న్యూస్‌.. బన్నీ, విజయ్‌ మల్టీస్టారర్‌!

27 Jan, 2021 13:33 IST|Sakshi

టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత మల్టీస్టారర్‌ సినిమాల జోరు పెరిగింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఇటీవల దాదాపు స్టార్‌ హీరోలు అందరూ మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక దర్శక, నిర్మాతలు కూడా ధైర్యంగా ఇద్దరి హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌,ఎన్టీఆర్‌లు కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి ఒక మల్టీస్టారర్‌ చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌ రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ భారీ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించనున్నారట. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.

బన్నీ, విజయ్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అల్లు అర్జున్‌ని విజయ్‌ ఆప్యాయంగా బన్నీ అన్న అని పిలుస్తుంటాడు. అలాగే విజయ్‌ని బన్నీ బ్రదర్‌ అని సంభోదిస్తాడు. విజయ్‌కు చెందిన‌ ‘రౌడీ బ్రాండ్’ దుస్తులు ధరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇంత క్లోజ్‌గా ఉండే ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే అభిమానులకు పండగనే చెప్పొచ్చు. ఇక బన్నీ-రౌడీలు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటే బాక్సాఫీస్‌ షేక్‌ అయిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు విజయ్‌ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ సరసన నటిస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. 
 

మరిన్ని వార్తలు