Allu Arjun Fans: పుష్ప-2 క్రేజ్.. అసలు 'తగ్గేదేలే' అంటున్న బన్నీ ఫ్యాన్స్

13 Nov, 2022 19:22 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ సంపాదించుకున్నారు బన్నీ. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, సౌత్ సినిమా ఇండస్ట్రీల్లో బన్నీ అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. పుష్ప క్రేజ్‌తో ఒక్కసారిగా గ్లోబర్ స్టార్‌గా మారిపోయారుస్టెలిష్ స్టార్. బన్నీ సినిమాలు రిలీజైనప్పుడు థియేటర్ల వద్ద అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. పుష్ప విడుదలైనప్పుడు థియేటర్లలో అభిమానులు కేకలతో హోరెత్తించారు. అంతే స్థాయిలో పుష్ప-2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రబృందం ఎప్పుడెప్పుడు అప్‌ డేట్స్ ఇ‍స్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. 

(చదవండి: అస్సలు తగ్గదేలే!)

ఆ డైలాగ్ ఒక ప్రభంజనం: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ మామూలుగా లేదు. పాన్‌ ఇండియా నుంచి పాన్ వరల్డ్‌ స్థాయిలో పుష్పరాజ్‌ వైరల్‌ అయ్యాడు. డైలాగ్స్‌, సాంగ్స్‌, స్టెప్పులు ఇలా సినిమాలో ప్రతీ అంశం ట్రెండ్‌గా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే ఆ ఒక్క డైలాగ్‌ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్‌ రూపంలో చేస్తూ కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. ఇంకా రష్మిక మందన్నా గ్లామర్‌కు తోడు అల్లు అర్జున్‌ డ్యాన్స్‌, విలన్ పాత్రలో ఫహాద్‌ ఫాజిల్‌ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేసింది. 

(చదవండి: సుకుమార్ భారీ ప్లానింగ్.. అదే రోజు పుష్ప-2 టీజర్‌ రిలీజ్‌కు ప్లాన్?)

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లంటే?: పుష్ప: ది రైజ్ థియేటర్ల వద్ద పలు రికార్డులను బద్దలు కొట్టింది. డిసెంబర్ 17, 2021న విడుదలైన ఈ చిత్రం మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు పుష్ప  రూ.71 కోట్ల కలెక్షన్లు రాగా.. రెండో రోజే రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. పాన్ ఇండియా స్థాయిలో దాదాపు రూ.319 కోట్ల వసూళ్లు రాగా..  ఓవర్సీస్‌లో రూ.35 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.354 కోట్లు వసూలు చేసింది. ఇది 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

పుష్ప -2 అప్‌ డేట్‌ ఇవ్వని చిత్రబృందం: పుష్ప బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో ఇక బన్నీ ఫ్యాన్స్‌ అంతా సీక్వెల్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవలే 'పుష్ప 2' షూటింగ్ ప్రారంభం అయినా చిత్రబృందం నుంచి ఎలాంటి అప్‌ డేట్ రాలేదు. అంతేకాకుండా అందులో పుష్ప-2 విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటులు నటిస్తున్నారని కొద్ది రోజులు ప్రచారం కూడా జరిగింది. మూవీ ‍అప్ డేట్స్‌ ఆలస్యం కావడమే బన్నీ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి కారణమైంది.

ఫ్యాన్స్‌ ఆగ్రహానికి కారణమదే: పుష్ప-2 అప్‌ డేట్స్ ఇవ్వాలంటూ ఆదివారం హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో మరింత ఆలస్యం పనికి రాదని అభిమానులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పుష్ప-2 అప్ డేట్స్‌ మరింత ఆలస్యమైతే తగ్గేదేలే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.  

మరిన్ని వార్తలు