భార్యతో అత్తారింటికి అల్లు అర్జున్‌.. అభిమానులకు తప్పని నిరాశ

28 Nov, 2022 13:21 IST|Sakshi

సినీ హీరో అల్లు అర్జున్‌ సతీసమేతంగా నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి వచ్చారు. అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తోడల్లుడు నామిరెడ్డి వీరారెడ్డి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం సినీ హీరో అల్లు అర్జున్‌ సతీసమేతంగా చింతపల్లి గ్రామానికి వచ్చి వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం పక్కనే ఉన్న అత్తారింటికి వెళ్లి గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే తమ సమీప బంధువుల పిల్లలు ఒకరిద్దరు ఇంట్లోకి వెళ్లి అల్లు అర్జున్‌తో ఫొటోలు దిగారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్‌ చింతపల్లికి వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు, పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు.

అల్లు అర్జున్‌తో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలను తీసుకోకుండా బౌన్సర్లు అడ్డుకున్నారు. తమ అభిమాన హీరో ఫొటో తీసుకోనీయక పోవడంతో అభిమానులు, ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. గతంలోనూ అల్లు అర్జున్‌ చింతపల్లి గ్రామానికి రెండు పర్యాయాలు దసరా పండుగకు వచ్చి సందడి చేశారు.
చదవండి: Shruti Hassan : శ్రుతిహాసన్‌ ఏంటి ఇలా తయారైంది? ఆమె ముఖానికి ఏమైంది?

మరిన్ని వార్తలు