ఆమీర్‌ ఖాన్‌ తనయుడి ఎంట్రీ.. 'మహారాజా'గా..!

9 Jun, 2021 09:06 IST|Sakshi

బాలీవుడ్‌లో టాప్‌ హీరోల వారసుల సిల్వర్‌స్క్రీన్‌ ఎంట్రీ ప్రతి ఏడాది ఉంటూనే ఉంటుంది. ఈ ఏడాది ఈ జాబితాలో ఆమీర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ పేరు చేరింది. జునైద్‌ ఖాన్‌ నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి సిద్ధార్థ్‌ పి. మల్హోత్రా దర్శకుడు. ఈ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ మంగళవారం ముంబైలో మొదలైంది. ఎనిమిది గంటలు మించకుండా టీవీ, సినిమాల షూటింగ్స్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ‘మహారాజా’ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు.

వ్యాక్సిన్‌ వేయించుకుని, నెగటివ్‌ కోవిడ్‌ రిపోర్టు ఉన్నవారినే సెట్స్‌లోకి అనుమతిస్తున్నారట. తొలిరోజు సీన్స్‌లో ప్రధాన తారాగణంతో పాటు 25 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారట. అలాగే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత చిత్రీకరణ ఆరంభించుకున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజా’యే అని బాలీవుడ్‌ టాక్‌. ఇక కథ విషయానికి వస్తే... ఈ చిత్రం 1862 నేపథ్యంలో సాగుతుందని, ఇందులో జునైద్‌ ఖాన్‌ జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారనీ టాక్‌. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ షాలినీ పాండే ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే జునైద్‌కి జోడీగానా? అనేది తెలియాల్సి ఉంది.

చదవండి : ‘సీత’ మూవీ మేకర్స్‌కు కరీనా షరతులు.. మరీ అంత రెమ్యునరేషనా?!

మరిన్ని వార్తలు