Amma Rajasekhar: అమ్మ హాస్పిటల్‌లో ఉందంటే కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు

26 Jul, 2022 20:48 IST|Sakshi

కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు అమ్మ రాజశేఖర్‌. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జేడీ చక్రవర్తితో ఉన్న గొడవను బయటపెట్టాడు. 'నాకు అర్జున్‌ సర్‌ గురువు. తర్వాత నాకు సపోర్ట్‌ చేసిన వ్యక్తి జేడీ చక్రవర్తి.  జేడీ, నేను కలిసి సినిమా తీద్దామనుకున్నాం. ఉగ్రం కథ ఫైనల్‌ కాగానే జేడీకి రూ.4 లక్షలు ముట్టజెప్పా. జేడీ సినిమా మధ్యలో ఇన్‌వాల్వ్‌ అవుతారని కొందరంటుంటే వెళ్లి అడిగేశా. మీరున్నారుగా మాస్టర్‌, నేను మధ్యలో జోక్యం చేసుకోను అని హామీ ఇచ్చాడు. సినిమా అంతా అనుకున్నట్లుగా పూర్తయింది. నిర్మాత నక్షత్ర మంచి వ్యక్తి. అతడికో ఫ్రెండ్‌ ఖాసిం ఉండేవాడు. అతడు జేడీకి వీరాభిమానిని అంటూ చేతిపై జేడీ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. వాడేదో కామెడీ చేస్తున్నాడనుకున్నాను. వాడు చేసేది ఓవరాక్షన్‌ అని జేడీ చూసుకోలేదు. 

తీరా 'ఉగ్రం' సినిమాకు రూ.60 లక్షల బిజినెస్‌ జరిగింది. నిర్మాత నక్షత్ర దిల్‌రాజులా ఫీలయ్యాడు. నాకు మాత్రం షేర్‌ ఇవ్వలేదు. మోసం చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. అసలు డబ్బులు వచ్చిన సంగతి కూడా నాకు చెప్పలేదు. నిజానికి వచ్చినదాంట్లో సగం ఇవ్వాలనేది అగ్రిమెంట్‌. సరే సగం ఇవ్వకపోయినా కనీసం వచ్చినదాంట్లో నుంచి ఎంతో కొంతైనా ఇవ్వమని అడిగాను.  చివరాఖరికి రూ.50 వేలు పడేశారు. చాలా బాధపడ్డాను. సినిమా ఫస్ట్‌ కాపీ వచ్చాక జేడీ దాంట్లో తలదూర్చాడు. అది మార్చి, ఇది మార్చి నాశనం చేశాడు. నా సినిమాను నా అనుమతి లేకుండా ఎలా మారుస్తారు. జేడీని గురువులా భావిస్తాను కాబట్టి సైలెంట్‌గా ఉండిపోయాను. 

ఓసారి అమ్మను హాస్పిటల్‌లో జాయిన్‌ చేశాం. చాలా సీరియస్‌గా ఉంది. నా డబ్బు నాకు ఇచ్చేయమని అడిగాను. అమ్మ హాస్పిటల్‌లో ఉంది, నాకు రూ.5 లక్షలు ఇవ్వమన్నా. అన్ని హక్కులు ఇచ్చేస్తాను కనీసం లక్ష రూపాయలు ఇవ్వురా అని అడిగినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆయన నాకు నమ్మకద్రోహం చేశాడు. వాళ్లు నన్నేదో చేశామని అనుకుంటున్నారు. కానీ వాళ్ల జీవితాలను వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. నన్ను నమ్మి ఉంటే వాళ్లకు పెద్ద హిట్‌ వచ్చేది' అని చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్‌.

చదవండి: స్టార్‌ హీరోల సినిమాలకు పెద్ద షాకే ఇది..
హోంటూర్‌ వీడియోను షేర్‌ చేసిన యాంకర్‌ శ్యామల

మరిన్ని వార్తలు