Anasuya Bharadwaj: అనసూయ తొలి సంపాదన ఎంతో తెలుసా?

15 May, 2021 12:37 IST|Sakshi

Happy Birthday Anausaya: మాటలతోనే కాకుండా అందచందాలతో ప్రేక్షకులను అలరించే తెలుగింటి ముద్దుగుమ్మ యాంకర్‌ అనసూయ. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో యాంకర్లలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ ఒకవైపు బుల్లితెరపై అలరిస్తూనే..  వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. నేడు(మే 15) యాంకర్‌ అనసూయ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. 

పవిత్ర అనుకున్నారు కానీ.. 
యాంకర్‌ అనసూయ  మే 15,1985లో పుట్టింది. ఆమె సొంతూరు నల్లగొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లి. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు. వాళ్ల అమ్మ ఆమెకు పవిత్ర అని పేరు పెట్టాలనుకుందట. కానీ వాళ్ల నాన్న మాత్రం వాళ్ల అమ్మ అనసూయ పేరునే తనకు పెట్టాడని సందర్భంలో అనసూయ చెప్పింది. 

​కుట్టు మిషన్‌ డబ్బుతో స్కూల్‌ ఫీజు
అనసూయ కుటుంబం చిన్నప్పుడు ఆర్థికంగా బాగానే ఉండేదట. కానీ వాళ్ల నాన్నాకు ఉన్న గుర్రెపు పందెల వ్యసనం వల్ల ఆస్తులన్ని పోగొట్టుకున్నారు. కొన్నేళ్ల పాటు అద్దె ఇంట్లో ఉన్నారట. వాళ్ల అమ్మ కుట్టు మిషన్‌ కుడుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేదట. ‘అమ్మ మిషన్‌ కుట్టి మా స్కూల్‌ ఫీజ్‌ కట్టేది. రూ.50 పైసలు మిగులుతుందని రెండు స్టాపులు నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేదాన్ని’అని అనసూయ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

తొలి సంపాదన రూ. 5 వేలు
అనసూయ ఎంబీఏలో హెచ్‌ఆర్‌ చేసింది. తొలుత ఓ బ్యాంకులో టెలీకాలర్‌గా పనిచేసింది. ఆమె తొలి జీతం రూ. 5వేలు మాత్రమే. ఆ తర్వాత ఒక విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే కొత్తమంది దర్శకులు ఆమెను చూసి సినిమా అవకాశాలు ఇచ్చారట. కానీ అనసూయ భయంతో వాటిని రిజెక్ట్‌ చేసిందట. నిశ్చితార్థం అయ్యాక కొన్ని కారణాల వల్ల హెచ్‌ఆర్‌ జాబ్‌ మానేసి ‘సాక్షి’లో న్యూస్‌ రీడర్‌గా చేరింది. కొన్నాళ్ల తర్వాత ఓ కామెడీ షోకి యాంకర్‌గా అవకాశం రావడంతో అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.

9 ఏళ్లు ప్రేమ పోరాటం
అనసూయది ప్రేమ వివాహం. ఆమె ఇంటర్‌లో ఉన్నప్పుడే సుశాంక్‌ భరద్వాజ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబితే.. అనసూయ వాళ్ల నాన్న ఒప్పుకోలేదట. పైగా వేరే సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టారట. దీంతో అనసూయ తొమ్మిదేళ్ల పాటు ప్రేమ పోరాటం చేసి సుశాంక్‌కు వివాహం చేసుకుంది. ఈ ప్రేమ జంటకు ఇద్దరు పిల్లలు.

ఇక ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. ‘క్షణం’తో ఆమె వెండితెరకు పరిచయం అయింది.  ఆ తర్వాత నాగార్జునతో‘సోగ్గాడే చిన్నినాయనా’లో నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.  ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ.. ‘పుష్ప’,  ‘ఖిలాడి’, ‘రంగమార్తాండ’ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మమ్ముట్టి నటిస్తున్న ఓ మలయాళం మూవీలో కీలకపాత్ర పోషిస్తుంది.

మరిన్ని వార్తలు