143 మంది అత్యాచారం కేసు: స్పందించిన ప్రదీప్‌

27 Aug, 2020 17:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సంచలనంగా మారిన యువతిపై 143 మంది అత్యాచారం కేసులో ప్రముఖ యాంకర్‌ మాచిరాజు ప్రదీప్‌ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు సైతం నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పలువర్గాల నుంచి ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా యాంకర్‌ ప్రదీప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనను టార్గెట్‌గా చేసుకుని తనకు ఎలాంటి సంబంధంలేని వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుటుంబాన్ని ఎంతో మానసిక కుంగుబాటుకు గురిచేస్తున్నారని అన్నారు. (42 పేజీల ఎఫ్‌ఐఆర్‌ రెడీ!)

‘సోషల్ మీడియాలో నా మీద వస్తున్న ఆరోపణలు ఎంతో బాధపెడుతున్నాయి. సున్నితమైన వివాదంలో నా పేరు పెట్టి ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు నా పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. మీడియా వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తాను. మీ ఆరోపణల కారణంగా నా కుటుంబం మానసికంగా బలవుతుంది. మమ్మల్ని మానసికంగా మానభంగం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలి కానీ నిజాలు తెలియకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు. సోషల్ నెట్ వర్క్ లో నా పేరు వాడటం చాలామందికి అలవాటుగా మారింది. అనవసరమైన ఆరోపణలతో నా సన్నిహతులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజానిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి’ అని వీడియో ద్వారా వెల్లడించారు.

తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీసీఎస్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్‌, బాధితురాలి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ రెడీ చేశారు. 143 మందిలో ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ లీడర్లు ఉన్నట్టు బాధితురాలు తెలిపింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది.

మరిన్ని వార్తలు