ఒక్క రూపాయి ఇచ్చినా చాలు: రష్మీ ఎమోషనల్‌

4 May, 2021 10:24 IST|Sakshi

ప్రముఖ డ్యాన్స్‌ షోలోని ఓ కంటెస్టెంట్‌ కష్టాల్లో ఉన్నారని, వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని యాంకర్‌ రష్మీ గౌతమ్‌ కోరింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్నిచ్చింది. "డ్యాన్సర్‌ పవిత్ర పరిస్థితి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె తల్లిదండ్రులిద్దరికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. డబ్బులు లేకపోవడం అతడి తండ్రికి సరిగా చికిత్స చేయించలేకపోయింది. దురదృష్టవశాత్తూ వైద్యం సరిగ్గా అందకో, మరే విషయమో తెలియదు కానీ ఆమె తండ్రి ప్రాణాలు విడిచారు. వాళ్లు ఆర్థికంగా ఉన్నవాళ్లు కాదు. కాబట్టి మనందరం వారికి సాయం చేద్దాం..

నా ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అందరూ తలా ఒక రూపాయి ఇచ్చినా చాలు. కనీసం రెండు లక్షల రూపాయలైనా వాళ్లకు ఇద్దాం. అందరూ కష్టకాలంలోనే ఉన్నారు. కానీ పవిత్ర మనకంటే దారుణమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి అందరం ఆమెకు సాయం చేద్దాం.." అని రష్మీ వేడుకుంది. ఆమె నిర్ణయానికి అభిమానులు అండగా నిలవడంతో తక్కువ సమయంలోనే రూ.2 లక్షలను పోగు చేసింది. ఈ మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందించింది. ఓ మంచి పనికి తనకు సపోర్ట్‌ చేసిన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది రష్మీ.

చదవండి: ఉమెన్స్‌ డే: రష్మీ గౌతమ్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు