‘ఎఫ్‌ 3’లో మూడో హీరో.. దర్శకుడి క్లారిటీ

26 Jan, 2021 12:56 IST|Sakshi

వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్‌3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్‌2’కి ఇది సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ‘ఎఫ్2’ లో భార్య‌ల మ‌న‌స్తత్వం వల్ల కుటుంబంలో గొడ‌వ‌లు జ‌రిగితే, ‘ఎఫ్ 3’లో డ‌బ్బు వ‌ల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జ‌రిగాయ‌నేది సీక్వెల్‌లో చూపించబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్‌లోనూ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేశాడు దర్శకుడు.

ఇదిలా ఉంటే  ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నట్లుగా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో మహేశ్‌ బాబు లేదా రవితేజ నటించబోతున్నారని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత గోపీచంద్‌ నటిస్తున్నారని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇందులో మెగా హీరో సాయితేజ్‌ కూడా నటిస్తున్నాడని రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించారు. ఎఫ్ 3 సినిమాలో మూడో హీరోగా ఎవరు చేయడం లేదని.. అసలు తనకు ఆ మూడో హీరో అన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఎఫ్ 2 లాగే ఎఫ్ 3 కూడా ఇద్దరు హీరోలతో మాత్రమే చిత్రీకరిస్తానని తెలిపాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2021 వేసవికి ప్రేక్షకుల మందుకు రాబోతుంది.  

మరిన్ని వార్తలు