నా కొడుకుతో సహా బిగ్‌బాస్‌కు వెళ్తా!: నటి

15 Mar, 2021 14:36 IST|Sakshi

బుల్లితెర బాస్‌ బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఒక్కసారిగా అడుగు పెట్టారంటే వారికి ఎక్కడలేని పాపులారిటీ వస్తుంది. మారుమూల పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరికీ అందులోని కంటెస్టెంట్లు సుపరిచితులుగా మారిపోతుంటారు. ఇక హౌస్‌లో వారి వేషధారణ, నడత, మాట తీరు అన్నింటి ఆధారంగా ప్రేక్షకులు అభిమానులుగా మారిపోతుంటారు. ఇష్టమైన కంటెస్టెంట్‌ను గెలిపించుకునేందుకు నెలల తరబడి కష్టపడుతుంటారు. ఇక షో నుంచి వచ్చిన వారు సైతం సినిమా అవకాశాలను చేజిక్కించుకుని కెరీర్‌లో దూసుకుపోతుంటారు. అయితే బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు టీవీ తారలు చూపించినంత శ్రద్ధాసక్తులు సినీ సెలబ్రిటీలు చూపించరు. తాజాగా నటి అనిత హసానందాని బిగ్‌బాస్‌ షోలో పాల్గొననున్నట్లు పేర్కొంది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు, ఆమె ఊరికే జోక్‌ చేసింది.

ఇంతకీ ఏమైందంటే హిందీ బిగ్‌బాస్‌ 13 విజేత సిద్దార్థ్‌ శుక్లా అనిత భర్త రోహిత్‌ రెడ్డిని కలిశాడు. సిద్దార్థ్‌ కండలు చూసి రోహిత్‌ స్టన్న్‌ అయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను రోహిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అది చూసిన నెటిజన్లు సిద్దార్థ్‌ను పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇది చూసిన అనిత కూడా ఓ ఫన్నీ కామెంట్‌ చేసింది. "బోలెడన్ని కామెంట్లు వస్తూనే ఉన్నాయి. నా కొడుకు అరవ్‌ను తీసుకుని నేను కూడా తర్వాతి సీజన్‌లో పాల్గొంటాను. బై రోహిత్‌" అంటూ జోక్‌ చేసింది. కాగా ‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అనిత‌ తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించింది. యే మొహబ్బతే, నాగిని వంటి హిట్‌ సీరియల్స్‌లో నటించింది. గత నెలలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా వుంటే హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో రుబీనా దిలైక్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

చదవండి: ఏడేళ్ల తర్వాత తొలి సంతానం.. బుడ్డోడి పేరేమిటంటే!

మరిన్ని వార్తలు