మలయాళ చిత్రం ప్రేమమ్తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ ప్రముఖ నటిగా రాణిస్తోంది. తమిళంలోనూ ధనుష్ సరసన కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అధర్వకు జంటగా తల్లిపోగాదే చిత్రంలో నటించింది.
తాజాగా సైరన్ అనే తమిళ చిత్రం, తెలుగులో రెండు చిత్రాలు, మలయాళంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉంది. ఈమె తెలుగులో కార్తీకేయ 2 వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత నటించిన 18 పేజెస్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ప్రేమ కథా చిత్రాల్లో నటించే అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయని చెప్పింది. అలా ఎప్పుడూ ఏదో ఒక ప్రేమ కథా చిత్రంలో నటిస్తూనే ఉన్నానని పేర్కొంది.
అయితే ప్రేమ కథా చిత్రాలు వేస్తూనే ఉండాలని కోరుకుంటున్నానంది. తనకు దర్శకత్వం చేయాలనే కోరిక ఉందని, కచ్చితంగా మెగా ఫోన్ పడతానని చెప్పింది. అయితే దర్శకత్వం చేపట్టే ముందు ఒక ఏడాది పాటు నటనకు విరామం ఇచ్చి ప్రముఖ దర్శకుడి వద్ద శిష్యరికం చేసి దర్శకత్వం శాఖలో మెలకువలు తెలుసుకుంటానని చెప్పింది. కొన్ని కథలను కూడా తన మదిలో ఉన్నాయని తెలిపింది. అయితే కథానాయకిగా చాలా చిత్రాల్లో నటించాల్సి ఉందని, అందువల్ల ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.
చదవండి: (టాలీవుడ్లో తీవ్ర విషాదం.. నటుడు చలపతిరావు హఠాన్మరణం)