Anupama Parameswaran: 'నాకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి.. అలాంటివి చేయను'

26 Aug, 2022 09:46 IST|Sakshi

'ప్రేమమ్‌' అనే మలయాళ చిత్రంతో మాలీవుడ్‌నే కాదు దక్షిణాది సినిమాను ఆకట్టుకున్న నటి అనుపమా పరమేశ్వరన్‌. ముఖ్యంగా టాలీవుడ్‌ ఈ అమ్మడిని బాగానే ఆదరిస్తోంది. కోలీవుడ్‌కు ధనుష్‌కు జంటగా కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం సక్సెస్‌ అయినా ఎందుకనో ఇక్కడ ఈ చిన్నదాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత నటించిన నటుడు అధర్వ సరసన తల్లిపోగాదే చిత్రంలో నటించింది. అదీ ఆమె కేరీర్‌కు పెద్దగా ఉపయోగ పడలేదు. ఇక్కడే కాదు ఇటీవల టాలీవుడ్‌లోనూ అనుపమ నటించిన చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో అవకాశాలు తగ్గాయి.

అలాంటి పరిస్థితుల్లో నిఖిల్‌తో నటించిన కార్తీకేయ– 2 చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మళ్లీ అనుపమ పరమేశ్వరన్‌ పేరు వినిపిస్తోంది. అంతేకాదు కార్తీకేయ 2 చిత్రం బాలీవుడ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తుండడంతో ఈ అమ్మడికీ అక్కడ అవకాశాలు వస్తున్నాయట. త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ సినిమాల్లో నటించడానికి తనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా హీరోలను పొగుడుతూ, వారి చుట్టూ తిరిగే పాత్రల్లో నటించనని చెప్పింది. తాను నటించే చిత్రాల్లో కథే హీరోగా ఉండాలని చెప్పింది.

అలాంటి చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నానని స్పష్టం చేసింది.. మలయాళ చిత్ర పరిశ్రమలో పరిమితుల్లో చిత్రాలను నిర్మిస్తున్నారని, భారీ తనానికి పోకుండా తక్కువ బడ్జెట్‌లో చిత్రాలను చేస్తున్నారని చెప్పింది. అయితే అక్కడ అద్భుతమైన కథా చిత్రాలు వస్తున్నాయని చెప్పింది. ఇక తెలుగులో భారీ చిత్రాలు నిర్మిస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఓటీటీలు రావడంతో సినిమాలను రీమేక్‌ చేయకుండానే ప్రేక్షకులు అన్ని భాషా చిత్రాలను చూస్తున్నారని అభిప్రాయపడింది. ఇక నటిగా తనకు మలయాళం, తెలుగు, తమిళం అనే బేధం లేదని, నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అన్నట్టు ఈ బ్యూటీ ఇటీవల బాగా వర్కౌట్స్‌ చేసి చాలా స్లిమ్‌గా తయారైంది.   

మరిన్ని వార్తలు