Anurag Kashyap: నా కూతుర్ని అనరాని మాటలన్నారు, డిప్రెషన్‌లోకి వెళ్లా.

27 Nov, 2022 17:39 IST|Sakshi

స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ ఒకానొక సమయంలో ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాడట. తన కూతురి గురించి ఆందోళనపడి మూడున్నరేళ్ల పాటు డిప్రెషన్‌లో ఉండిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'పౌరసత్వ సవరణ (సీఏఏ) చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నామీద, నా కుటుంబం మీద ఎంతో ద్వేషం చూపించారు. నా కూతుర్ని అత్యాచారం చేసి చంపుతానని బెదిరించారు. ఆ బెదిరింపుల వల్ల ఆమె ఎంతో ఒత్తిడికి లోనయ్యేది. ఇంత నెగెటివిటీ భరించలేక ట్విటర్‌ నుంచి వైదొలిగాను. పోర్చుగల్‌ వెళ్లిపోయాను. కొంతకాలానికి ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌ సినిమా షూటింగ్‌ ఉండటంతో భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

నా కూతురు ఆలియా కశ్యప్‌ ఏదున్నా బయటకు మాట్లాడేస్తుంది. కానీ ఆమె లోలోపల పడే ఆందోళన నన్ను ఎంతగానో బాధపెట్టింది. సోషల్‌ మీడియాలో మొదలైన బెదిరింపుల వల్ల ఆమె చాలా డిస్టర్బ్‌ అయింది. తన కోసమే నేను అన్నీ వదిలేసి అమెరికాకు వెళ్లిపోయాను. ప్రతిదానికీ ఆలియా కంగారుపడిపోతుంది, అదొక్కటే నన్ను టెన్షన్‌ పెడుతుంది. దాదాపు మూడేళ్లు డిప్రెషన్‌లో ఉన్నాను. గతేడాది గుండెపోటు వచ్చి ఆస్పత్రిపాలయ్యాను. కానీ కోలుకున్న వెంటనే తిరిగి సినిమాలు మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు అనురాగ్‌ కశ్యప్‌. కాగా అనురాగ్‌ డైరెక్ట్‌ చేసిన ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ కానుంది.

చదవండి: ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు
నిహారికతో బ్రేకప్‌.. సింగర్‌ క్లారిటీ

మరిన్ని వార్తలు