Jhulan Goswami Biopic Update: రానున్న మరొక క్రికెటర్‌ బయోపిక్‌.. లీడ్‌ రోల్‌లో అనుష్క ?

8 Dec, 2021 11:10 IST|Sakshi

Anushka Sharma Not Doing Cricketer Jhulan Goswami Biopic: బాలీవుడ్‌లో పాపులర్‌ క్రికెటర్స్‌పై బయోపిక్‌ చిత్రాలు చాలా వచ్చాయి. ఎంఎస్‌ ధోని నుంచి ప్రస్తుతం రాబోతున్న 'శభాష్‌ మిథూ', '83' వరకు మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాయి. తాజాగా మరో క్రికెటర్‌ బయోపిక్‌ రానుంది. భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ 'జులన్‌ నిషిత్‌ గోస్వామి'పై సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నటి అనుష్క ప్రొడక్షన్‌ హౌజ్‌ 'క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌' నిర్మిస్తుంది. ముందుగా ఈ చిత్రంలో జులన్‌ గోస్వామిగా అనుష్క శర‍్మ నటించాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల అనుష్క తప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అనుష్క శర్మ నటించిన 'పరి' చిత్రం డైరెక్టర్‌ ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

అయితే గత సంవత్సరం కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లోని క్రికెట్‌ గ్రౌండ్‌లో అనుష్క, జులన్‌ షూటింగ్‌కు సంబంధించిన అనేక ఫొటోలు బయటకొచ్చాయి. ఆ ఫొటోలు అనుష్క అభిమానుల సోషల్ మీడియా పేజీలలో తెగ వైరల్ అయ్యాయి. అవి అలా వైరల్‌ కావడంతో అనుష‍్క శర్మ జులన్ గోస్వామి బయోపిక్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫొటోల్లో దర్శకుడు ప్రోసిత్‌ రాయ్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం జులన్‌ గోస్వామిగా కొత్త నటిని తీసుకోనున్నారని సమాచారం. ఈ జులన్‌ గోస్వామి బయోపిక్‌ను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి నిర్మించనున్నారు. 

ఈ బయోపిక్‌లో జులన్ స్వస్థలం పశ్చిమ బెంగాల్‌ నాడియా జిల్లాలోని చక్‌దాహ నుంచి లార్డ్స్‌ వరకు ఆమె ప్రయాణంతోపాటు మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఇండియా ఓటమిని చూపించనున్నారు. పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహిత, మహిళల వన్డే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జులన్ నిషిత్ గోస్వామిపై తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2007లో ఐసీసీ ఉమెన్స్‌ ప్లేయర్ ఆఫ్‌ ది ఇయర్‌గా జులన్‌ ఎంపికైంది. జులన్‌ గోస్వామి 2008-20011 మధ్య భారత మహిళా క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. 

మరిన్ని వార్తలు