సినీ పరిశ్రమకు ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం

18 Dec, 2020 20:41 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊరటనిచ్చింది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్న‌ట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ కేబినెట్ తెలిపింది.
(చదవండి : ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..)

మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.దింతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. రీస్టార్ట్‌ ప్యాకేజీకింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు, ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన స‌హ‌కారానికి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సాయం ఎనలేనిదని న ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ కొనియాడారు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కూడా సోషల్ మీడియాలో దీనిపై స్పందించింది. సీఎం జగన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులు, ఇతర ఊరట చర్యలు చిత్ర పరిశ్రమ పునఃప్రారంభానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంది.చిత్ర పరిశ్రమ కోసం రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది.

మరిన్ని వార్తలు