విజయవాడరూరల్: ఆంధ్రప్రదేశ్లో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తోందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. ఆల్ ఇండియా సుమన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ధూళిపాళ్ళ దేవేంద్రరావు ఇంటి వద్ద జరిగిన ఒక కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన సందర్భంలో చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తామని చెప్పారన్నారు.
పి.నైనవరంలో మాట్లాడుతున్న సినీ నటుడు సుమన్
బుల్లితెరపై వస్తున్న సీరియల్స్, వెబ్ సిరీస్లలో సెక్స్ వయొలెన్స్ ఎక్కువగా ఉంటోందని, చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లలో వాటిని చూసి ఆ ప్రభావానికి లోనవుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బుల్లితెర సినిమాలకు, పెద్ద సినిమాలకు సెన్సార్బోర్డు నిబంధనలు ఒకేలా ఉంటే బాగుంటుందన్నారు. షార్ట్ ఫిలింస్ సత్తా చాటుతున్నాయని, నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారన్నారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తాను ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడంలేదని తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను చూసేవారికే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించలేరన్నారు.