మనందరి కథ

13 Apr, 2021 06:21 IST|Sakshi

‘‘సంగీత ప్రపంచంలో 27 ఏళ్ల ప్రయాణం నాది.. ఈ జర్నీలో ఎంతో మంది అద్భుతమైన దర్శకులతో పని చేశాను. ప్రస్తుత తరానికి కొత్త తరహా కథలు కావాలి. నేను కొత్త రైటర్‌ని కాబట్టి కొత్త డైరెక్టర్‌ అయితే బాగుంటుందనిపించి విశ్వేశ్‌ కృష్ణమూర్తిని తీసుకున్నాం. నా విజన్ని అర్థం చేసుకుని, నాకేం కావాలో దాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు తను బాగా కష్టపడ్డాడు’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్  అన్నారు. ఇహాన్‌ భట్, ఎడిల్‌సీ జంటగా విశ్వేశ్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘99 సాంగ్స్‌’.

వీఎమ్‌ మూవీస్, ఐడియల్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై జియో స్టూడియోస్, ఎ.ఆర్‌.రెహమాన్  సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వర్చ్యువల్‌ మీడియా సమావేశంలో ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ– ‘‘99 సాంగ్స్‌’ మనందరి కథ. ఇన్నేళ్ల నా అనుభవాన్ని జోడించి, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు కథ తయారు చేసుకున్నాను. ఇది రియలిస్టిక్‌ స్టోరీ. మ్యూజిక్‌ నేపథ్యంలో జరుగుతుంది. మ్యూజిక్‌ అన్నది సెక్యూర్డ్‌ జాబ్‌ కాదు. ఇదొక హాబీ. ఎక్కువ కాలం నిర్మాతగా ఉండాలన్నది నా కల కాదు. సంగీత దర్శకుడిగానే ఉండాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇహాన్  భట్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం గిటారు వాయించడంలో ఏడాది శిక్షణ తీసుకున్నాను. నేను కొత్త హీరోని. అందరూ థియేటర్లో చూసి, సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు