ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది

5 Mar, 2021 05:59 IST|Sakshi
శ్రియా పింగోల్కర్, జోయా హుస్సేన్, రానా, ప్రభు సాల్మన్, విష్ణు విశాల్‌

– రానా

‘‘మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడ్నుంచి ఏమీ తీసుకెళ్లలేం అనే విషయం అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని నాకు ఏనుగు మరోలా చెప్పింది. ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఈ భూమిని నువ్వు చూసుకుంటే అది మళ్లీ నిన్ను చూసుకుంటుందని. ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చేసింది’’ అని రానా అన్నారు. రానా హీరోగా ప్రభు సాల్మన్‌  దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, శ్రియా పింగోల్కర్, జోయా హుస్సేన్‌  ప్రధాన పాత్ర«ధారులు.

ఈ నెల 26న రిలీజ్‌ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్య క్రమంలో రానా మాట్లాడుతూ– ‘‘సిటీలో పెరిగిన ఓ కుర్రాడు ప్రకృతికి, మనుషులకు జరిగిన పోరాటంలో ఏనుగులను రిప్రజెంట్‌ చేస్తూ.. వాటిని ఎలా రక్షించాడు? అనే కథతో ‘అరణ్య’ను రూపొందించాం’’ అన్నారు. ‘‘ఐదేళ్లుగా ఏడాదికి 800 ఏనుగుల వరకూ మరణిస్తున్నాయి. దీనికి అడవుల విస్తీర్ణం తగ్గడం ఓ కారణం. రానా ఇందులో ఏనుగుల గొంతుకగా కనిపిస్తారు’’ అన్నారు సాల్మన్‌ . ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఈరోస్‌ ప్రతినిధి నందు అహూజా.

మరిన్ని వార్తలు