అరుణ్‌ విజయ్‌ ఎమీజాక్సన్‌ జంటగా.. రూ.3.5 కోట్లతో లండన్‌ సెట్‌

30 Oct, 2022 08:12 IST|Sakshi

నటుడు అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి అచ్చమ్‌ ఎంబదు ఇల్లయే అనే టైటిల్‌ ఖరారు చేశారు. నటి ఎమీజాక్సన్‌ కథానాయకిగా, కీలక పాత్రలో నిమీషా విజయన్‌ నటిస్తున్నారు. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ షిరిడీ సాయి మూవీస్‌ పతాకంపై శ్రీ,కావ్య సమర్పణలో ఎం. రాజశేఖర్, ఎస్‌. స్వాతి నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు విజయ్‌ తెలుపుతూ చిత్ర తొలి షెడ్యూల్‌ లండన్‌లో నిర్వహించినట్లు తెలిపారు.

అక్కడ నటుడు విజయ్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. అక్కడ షూటింగ్లో విజయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చిన లెక్క చేయకుండా షూటింగ్‌కు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో బాధను భరిస్తూనే నటించారన్నారు. కాగా చిత్ర రెండవ షెడ్యూల్‌ను చెన్నైలోని బిన్నీమిల్స్‌ సమీపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఈ చిత్రం కోసం రెండున్నర ఎకరాల స్థలంలో రూ.3.5 కోట్ల వ్యయంతో లండన్‌ సెట్‌ వేసినట్లు చెప్పారు. దీన్ని రామలింగం మేస్త్రి సహాయంతో ఆర్డ్‌ డైరెక్టర్‌ శరవణన్‌ వేలాదిమంది కార్మికులతో రూపొందించారని తెలిపారు.

అదేవిధంగా ఈ చిత్రం కోసం 1000 మందికి పైగా విదేశాలకు చెందిన జూనియర్‌ ఆర్టిస్టులను రప్పించినట్లు చెప్పారు. వాళ్లతో అరుణ్‌ విజయ్‌ నటిస్తున్న భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. కాగా దర్శకుడు విజయ్‌ ప్రణాళిక ప్రకారం షూటింగును అనుకున్న దానికంటే ముందుగానే పూర్తి చేస్తున్నారంటూ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా దీనికి సూర్యవంశీ, ప్రసాద్‌ గోదా, జీవన్‌ గోదా సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని, సందీప్‌ కె. విజయ్‌ చాయాగ్రహణం అందిస్తున్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు