పైరసీ సినిమాలు చూడకూడదు: హీరో అరుణ్‌ విజయ్‌

12 Aug, 2022 10:42 IST|Sakshi

‘‘ఒక సినిమా తీయాలంటే ఎంత శ్రమ ఉంటుందో అందరికీ తెలుసు. ఆ కష్టం పైరసీ వల్ల దోపిడీకి గురవుతోంది. పైరసీ చేసేవాళ్లను చట్టానికి పట్టించాలి.. ప్రేక్షకులు కూడా పైరసీ సినిమాలు చూడకూడదు’’ అని హీరో అరుణ్‌ విజయ్‌ అన్నారు. అరివళగన్‌ దర్శకత్వంలో అరుణ్‌ విజయ్, వాణీ బోజన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘తమిళ్‌ రాకర్స్‌’. ఏవీఎం స్టూడియోస్‌పై అరుణ గుహ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ సోనీ లివ్‌ ఓటీటీలో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో అరివళగన్‌ మాట్లాడుతూ– ‘‘కొత్త సినిమాలను వెబ్‌ సైట్‌లో పెట్టడం వల్ల వారు ఏం ప్రయోజనం ఆశిస్తున్నారు? వీళ్ల నెట్‌వర్క్‌ ఎలా పనిచేస్తోంది? అనే ప్రశ్నలకు మా వెబ్‌ సిరీస్‌లో సమాధానం చెప్పబోతున్నాం’’ అన్నారు.  ‘‘మా ఏవీఎం సంస్థలో నిర్మించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇది. ముందు సినిమాగానే నిర్మించాం. అయితే రెండున్నర గంటల్లో కథను చెప్పలేం కాబట్టి సిరీస్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు అరుణగుహ. ‘‘ఈ వెబ్‌ సిరీస్‌లో సంధ్య అనే ఫోరెన్సిక్‌ హెడ్‌ క్యారెక్టర్‌లో నటించాను’’ అన్నారు వాణీ బోజన్‌. 

మరిన్ని వార్తలు