Vijay: మరో తెలుగు సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విజయ్‌

21 Oct, 2022 09:36 IST|Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు టాలీవుడ్‌పై మక్కువ చూపుతున్నారనడంలో ఎలాంటి సందేహమే లేదు. నటుడు విజయ్, ధనుష్‌​, శివకార్తికేయన్‌ వంటి స్టార్‌ హీరోలు ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. కమల్‌హాసన్, రజనీకాంత్‌ వంటి సీనియర్‌ హీరోలు ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించారు. నటుడు కార్తీ కూడా ఆ మధ్య ఊపిరి అనే తెలుగు చిత్రంలో నాగార్జునతో కలిసి నటించారు. తాజాగా నటుడు సూర్య కూడా మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించనున్న భారీ బడ్జెట్‌ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

నటుడు విజయ్‌ తెలుగులో మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఈయన ప్రస్తుతం వారీసు (తెలుగులో వారసుడు) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కాబోతున్నారు. దిల్‌రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్న ఇందులో నటి రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా విజయ్‌ తదుపరి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నటించే 67వ చిత్రం అవుతుంది.

ఇప్పుడు విజయ్‌ 68వ చిత్రం గురించి ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆయన తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌కు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఆ సంస్థ నుంచి విజయ్‌ అడ్వాన్స్‌ కూడా తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు, ఆయన ఇటీవల మైత్రీ మూవీస్‌ అధినేతలకు కథను కూడా వినిపించినట్లు సమాచారం. ఇప్పటికే విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరీ, మెర్సల్‌ వంటి హిట్‌ చిత్రాలు వచ్చాయి. అట్లీ ప్రస్తుతం షారుఖ్‌ఖాన్, నయనతార జంటగా హిందీలో జవాన్‌ చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి విజయ్‌తో చేసే చిత్ర కథపై దృష్టి సారిస్తున్నట్లు కోడంబాక్కం టాక్‌. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.

మరిన్ని వార్తలు