Ayushmann Khurrana: ఖరీదైన ఇల్లు కొన్న ఆయుష్మాన్‌ ఖురానా

12 Jan, 2022 11:49 IST|Sakshi

అమితాబ్‌ బచ్చన్‌, సన్నీలియోన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అర్జున్‌ కపూర్‌.. ఇలా పలువురు బాలీవుడ్‌ తారలు గతేడాది ఖరీదైన అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు ఆయుష్మాన్‌ ఖురానా. తాజా నివేదికల ప్రకారం.. ఆయుష్మాన్‌ ఖురానా, అతడి సోదరుడు అపరశక్తి ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ కాంప్లెక్స్‌లో రెండు ఫ్లాట్స్‌ కొన్నారు. విండ్సర్‌ రియల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రెండు అపార్ట్‌మెంట్లను వీరు తమ పేరిట రాయించుకున్నారని సమాచారం.

లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని విండ్సర్‌ గ్రాండే రెసిడెన్స్‌ 20వ ఫ్లోర్‌లో ఉన్న ఈ రెండు అపార్ట్‌మెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ గతేడాది నవంబర్‌ 29నే పూర్తి అయినట్లు తెలుస్తోంది. 4,027 చదరపు అడుగుల విస్తీర్ణం, నాలుగు కార్లు పార్కింగ్‌ చేసుకునే సామర్థ్యం ఉన్న ఇంటి కోసం ఆయుష్మాన్‌ రూ.19.30 కోట్లు చెల్లించాడట! స్టాంప్‌ డ్యూటీ కింద రూ.96.50 లక్షలు అప్పజెప్పాడట.

1745 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న అపార్ట్‌మెంట్‌ కోసం అపరశక్తి రూ.7.25 కోట్లు వెచ్చించాడట. స్టాంప్‌ డ్యూటీ కింద రూ.36.25 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ డిసెంబర్‌ 7న పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ ఇంట్లో రెండు కార్లు పార్క్‌ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇదిలా ఉంటే గతేడాది ఆయుష్మాన్‌, అపరశక్తి ఇద్దరూ కలిసి తమ ఫ్యామిలీ కోసం చండీగఢ్‌లోని పాంచ్‌కులలో రూ.9 కోట్లు విలువ చేసే ఇంటిని కొన్నారు.

మరిన్ని వార్తలు