Priyadarshi: దిల్ రాజ్ కాల్ చేయగానే షాక్‌కు గురయ్యా: ప్రియదర్శి

8 Mar, 2023 20:04 IST|Sakshi

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించిన సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లో  రన్‌ అవుతోంది. విడుదలైన మొదటిరోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. తెలంగాణ గొప్పదనాన్ని.. సంప్రదాయాలు, సంస్కృతితో తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. పలు సినిమాల్లో ప్రియదర్శి కమెడియన్‌గా కనిపించేవారు. అయితే ఈసారి హీరోగా మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియదర్శి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

 ప్రియదర్శి మాట్లాడుతూ.. 'ఓ రోజు దిల్ రాజు నుంచి కాల్ వచ్చింది. దీంతో నేను షాక్‌కు గురయ్యా. ఆ తరువాత వేణు యేల్దండి వచ్చి కథ చెప్పగా నేను ఏడవటం మొదలుపెట్టా. దిల్ రాజుకి ఫోన్ చేసి సినిమా చేస్తానని చెప్పేశా. కానీ బలగం విడుదలైన రోజు కలెక్షన్లు అంతగా లేవు. మేము వెళ్లిన థియేటర్ కేవలం సగం మాత్రమే నిండిపోయింది. నేనూ, వేణు యేల్దండి చాలా బాధపడ్డాం. మంచి సినిమా చేశాం. కానీ దిల్ రాజు ఓ విషయం చెప్పారు. జనాలు థియేటర్లకు రావడానికి రెండు రోజులు సమయం పడుతుంది. ఆయన చెప్పినట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది'. అంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రియదర్శి.
 

మరిన్ని వార్తలు