భీష్మునిగా నటించాను, కానీ తీసేశారు: బాలకృష్ణ

23 Feb, 2021 19:59 IST|Sakshi

నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా 'ఎన్‌టీఆర్‌- కథానాయకుడు', 'ఎన్‌టీఆర్‌- మహానాయకుడు' అని రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండింటిలో తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు ఆయన తనయుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ. బాలయ్యకు ఎంతగానో సంతృప్తినిచ్చిన ఈ చిత్రాలు కమర్షియల్‌గా పెద్దగా విజయాన్ని సాధించలేకపోయాయి. అయితే ఎన్‌టీఆర్‌ పోషించిన ఎన్నో పాత్రలను బాలయ్య మరోసారి పోషించగలిగాడు. ఈ క్రమంలో తండ్రి పోషించిన భీష్మ పాత్రను కూడా ఈయన తిరిగి పోషించాడు. కానీ సినిమా నిడివి ఎక్కువ అవుతుండటంతో ఆ పాత్ర సన్నివేశాలను తొలగించారు. దీంతో అభిమానులు బాలయ్యను భీష్ముడిగా చూడలేకపోయారు.

నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా 'ఎన్‌టీఆర్‌- కథానాయకుడు' సినిమాలో బాలయ్య తను భీష్మునిగా నటించిన స్టిల్స్‌ను విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకు మించి భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకే ఎన్‌టీఆర్‌ కథానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వలన సినిమాలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన ఆ పాత్రకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. భీష్మునిగా బాలయ్యను చూసిన అభిమానులు వాటిని తెగ షేర్లు చేస్తున్నారు.

చదవండి: కన్ను తాకితే కరోనా వచ్చింది!

పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు

మరిన్ని వార్తలు