హీరోగా మారనున్న బం‍డ్ల గణేష్‌!.. ఇక దబిడిదిబిడే..

8 Jul, 2021 13:01 IST|Sakshi

కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్‌.. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో నిర్మాతగా సక్సెస్‌ అయ్యాడు. ఆ తర్వాత నటుడిగా దూరమైన ఆయన ఇటీవలి కాలంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు. మహేష్‌బాబుతో కలిసి ట్రైన్‌ ఎపిసోడ్‌లో కనిపించి మరోసారి బండ్ల గణేష్‌ నవ్వులు పంచాడు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇకపై అలాంటి పాత్రలు చేయనని స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు. ఇటీవలె ఆయనకు తమిళ రీమేక్‌లో నటించిన అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన మండెల రీమేక్‌లో హీరోగా నటించాలని దర్శకుడు బండ్లను అప్రోచ్‌ అవగా, అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

తమిళంలో ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు చేసిన పాత్రలో నటించేందుకు సిద్ధంగా లేనని చెప్పారట. అయితే తాజాగా మరోసారి బండ్ల గణేష్‌కు హీరోగా ఛాన్స్‌ వచ్చిందట. వెంకట్‌ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథతో బండ్ల గణేష్‌ సంతృప్తి చెందారని, దీంతో ప్రధాన పాత్ర పోషించేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీలో నటించేందుకు బండ్ల ఓకే చెప్పారని, అంతేకాకుండా ఈ సినిమాను స్వయంగా ఆయనే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా లేదా అన్నది త్వరలోనే చూడాలి మరి. 
 

మరిన్ని వార్తలు