వకీల్‌సాబ్‌ : ట్రైలర్‌కే అద్దాలు పగిలితే.. ఇక సినిమా రిలీజైతే‌‌

30 Mar, 2021 13:26 IST|Sakshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రీల్‌9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ట్రైలర్‌ను విడుదల చేశారు. వైజాగ్‌ థియేటర్‌లో ట్రైలర్‌ చూసేందుకు పవన్‌ అభిమానులు ఎగబడ్డారు. కిక్కిరిసిన జనంతో అద్దాలు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. దీనిపై స్పందించిన పలువురు పవన్‌ అభిమానులు...'కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం' అని అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను సినీ నిర్మాత బండ్ల గణేష్‌..తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియోను అభిమానులు రీట్వీట్లు చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 

బాలీవుడ్‌ సినిమా ‘పింక్‌’కు రీమేక్‌గా వస్తున్న సినిమా ఇది. హిందీలో అమితాబ్ చేసిన  లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్‌ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజ్‌, శిరీశ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్‌ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

చదవండి : వకీల్‌సాబ్‌ ట్రైలర్‌ లాంఛ్‌.. ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ
వకీల్‌ సాబ్ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ కామెంట్‌

మరిన్ని వార్తలు