నటికి కరోనా: ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరణ

6 Jan, 2021 11:42 IST|Sakshi

కోల్‌కతా: షూటింగ్‌ కోసం భారత్‌కు వచ్చిన బ్రిటీష్‌ నటి బనితా సంధు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా రానంటూ మొండికేశారు. అంతేకాక అక్కడ నుంచి పరారయ్యేందుకు సైతం యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమె పారిపోకుండా రక్షణ కల్పించారు. వివరాల్లోకి వెళితే.. కవితా తెరెసా సినిమా షూటింగ్‌ కోసం హీరోయిన్‌ బనితా సంధు డిసెంబర్‌ 20న కోల్‌కతాకు వచ్చారు. అయితే ఆ విమానంలోని ఓ ప్రయాణికుడికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులతో పాటు సదరు నటికి సైతం పరీక్షలు నిర్వహించారు. (చదవండి: సినిమా చూసి సంతోషంగా ఇంటికి వెళతారు)

ఈ క్రమంలో సోమవారం నాడు బనితాకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అయితే అది కొత్త స్ట్రెయినా, లేదా సాధారణ కరోనానా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇక యూకే నుంచి వస్తున్నవారిలో పాజిటివ్‌ అని తేలిన వారిని బెలియాఘట ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా... బబితాను కూడా అక్కడికే పంపించారు. కానీ ఆమె ఆ ఆస్పత్రికి వెళ్లనని మొండికేస్తూ అంబులెన్స్‌ దిగడానికి నిరాకరించింది. ఓవైపు సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అంబులెన్స్‌ చుట్టూ కవచంలా నిలబడి ఆమె పారిపోకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా బనితా సంధు.. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన 'అక్టోబర్'‌ చిత్రంతో వెండితెరపై తెరంగ్రేటం చేశారు. ఆదిత్య వర్మ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో లక్‌ పరీక్షించుకున్నారు. సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన ఈ చిత్రం తెలుగు అర్జున్‌ రెడ్డికి రీమేక్‌. (చదవండి: మీ పేషెంట్లను చూస్తుంటే జాలేస్తోంది..: మాధవన్‌)

మరిన్ని వార్తలు