మన ఇంటి కథలా ఉంటుంది : బెల్లంకొండ గణేష్‌

27 Sep, 2022 11:23 IST|Sakshi

‘‘స్వాతిముత్యం’ లో నన్ను నేను మొదటిసారి బిగ్‌ స్క్రీన్‌పై చూసుకుంటే టెన్షన్‌గా ఉంది. ట్రైలర్‌లో చూసినట్టుగానే ఈ సినిమా చాలా సరదాగా మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో జరిగే కథలాగా ఉంటుంది’’ అని బెల్లంకొండ గణేష్‌ అన్నారు. లక్ష్మణ్‌.కె.కృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలసి సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 5న విడుదలకానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం బెల్లంకొండ గణేష్‌ మాట్లాడుతూ– ‘‘లక్ష్మణ్‌ చెప్పిన ‘స్వాతిముత్యం’ కథ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మాను. ఈ సినిమా అద్భుతంగా రావడానికి ప్రధాన కారణం వంశీగారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు.

‘‘స్వాతిముత్యం’ రెగ్యులర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాదు.. కొత్త పాయింట్‌ ఉంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నాగవంశీఅన్నకు థ్యాంక్స్‌’’ అన్నారు లక్ష్మణ్‌.కె.కృష్ణ. ‘‘స్వాతిముత్యం’ సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వర్ష బొల్లమ్మ. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. ∙నాగవంశీ, వర్ష, గణేశ్, లక్ష్మణ్‌

మరిన్ని వార్తలు