అందుకోసమే 15 రోజులు ఎవరితో మాట్లాడలేదు: నటుడు

14 Jun, 2022 20:44 IST|Sakshi

Bengali Actor Rahul Arunoday Banerjee Kept Mum For 15 Days: సినిమాల్లో రియల్ స్టంట్స్‌ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచే హీరోలు ఉన్నారు. అలాగే పాత్రలో ఒదిగిపోయేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడతారు కొందరు నటులు. అలాంటి నటుల్లో ఒకరు రాహుల్‌ అరుణోదయ్‌ బెనర్జీ. ఆయన తాజాగా నటించిన బెంగాలీ చిత్రం 'మృత్యుపతోజాత్రి (ఎవరు చనిపోతారో)'. సౌమ్య సేన్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరణశిక్ష పడిన ఖైదీ పాత్రలో రాహుల్‌ నటించారు. చనిపోవడానికి 12 గంటల ముందు ఖైదీల మానసిక పరిస్థితిని ఇందులో చూపించారు. అయితే ఇందుకోసం షూటింగ్‌కు ముందు సుమారు 15 రోజులు ఎవరితోనూ రాహుల్‌ మాట్లాడలేదట. కనీసం వారి ఇంటిసభ్యులతో కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నాడట. 

'నిజానికి తాము ఎప్పుడూ చనిపోతామో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ, తన జీవితం 12 గంటల తర్వాత ముగుస్తుందని తెలుసు. దానిని అర్థం చేసుకోవడం కష్టం. అతనికి తెలుసు ఆ మరణంలో ఎలాంటి గౌరవం ఉండదని. ఆ సమయంలో అతనికి మద్దతుగా ఎవరు నిలబడరు. నేను చిత్రీకరణకు 15 రోజులు ముందు నుంచే మా ఇంట్లోవాళ్లతో మాట్లాడటం మానేశాను. మా డైరెక్టర్‌ సౌమ్య సేన్‌గుప్తా చాలా బాగా రీసెర్చ్‌ చేశారు. చాలా స్టడీ మెటీరియల్స్‌ ఇచ్చారు.' అని పేర్కొన్నారు నటుడు రాహుల్‌ అరుణోదయ్‌ బెనర్జీ.

చదవండి: వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన
హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..

  

'ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. ఇది కల్పితమైనప్పటికీ నిజ జీవితంలో ఖైదీల గురించి కొన్ని పుస్తకాలు, న్యాయవాదులు, పోలీసులతో జరిగిన చర్చల ఆధారంగా స్క్రిప్ట్‌ను డెవలప్‌ చేయడంలో ఉపయోగపడ్డాయి. ఉరిశిక్ష పడిన ఖైదీ చివరి 12 గంటలు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. ఆ సమయంలో అపరాధ భావం, మానసిక సంఘర్షణ, మరణ భయం వంటి విషయాలను ఎలా అనుభవిస్తారో ప్రేక్షకులకు తెలియచెప్పాలనుకున్నాను. ప్రేమ, జీవితాలపై సినిమాలు చేయగలిగినప్పుడు మరణంపై ఎందుకు సినిమా తీయకూడదు.' అని తెలిపారు డైరెక్టర్‌ సౌమ్య సేన్‌గుప్తా. 

మరిన్ని వార్తలు