సంచలనం: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ ప్రముఖులు

5 Apr, 2021 19:52 IST|Sakshi

బెంగళూరు: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు సినిమా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలతో పాటు 8 మంది ఈవెంట్ మేనేజర్‌ల పాత్ర ఉందని సమాచారం. ఇప్పటికే సినిమా హీరో తనీశ్‌ని బెంగళూరు పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. తనీశ్‌తో పాటు హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త సందీప్ రెడ్డిని పోలీసులు విచారించారు.

ఈవెంట్ మేనేజర్ కలహరెడ్డితోపాటు, రతన్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సందీప్ రెడ్డి, తనిశ్‌ స్టేట్మెంట్ మేరకు నాలుగు కేసులను నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కేసులో సందీప్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్‌ ఆధారంగా విచారణ చేస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కలహర్ రెడ్డితో కలిసి సందీప్‌ బెంగళూరు వెళ్లాడు. అక్కడ నిర్మాత శంకర్‌ గౌడ్‌ ఇచ్చిన పార్టీలో కలహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నాడు.

2019లో శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఎమ్మెల్యేతో పాటు పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఆ పార్టీలోనే కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి, శ్రీను రెడ్డి, నటుడు తనీశ్‌ కలిసి పాల్గొన్నారు. మూడు రోజులపాటు శంకర్ రౌడీ శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఎంజాయ్ చేసినట్లు సందీప్‌ వివరించాడు. దీంతో పాటు అక్కడ ఇరానీ గర్ల్స్‌తో కలిసి డ్యాన్స్‌లతో ఎంజాయ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మందు, విందు, చిందులతో మూడు రోజుల పాటు హంగామా చేశామని చెప్పారు. అయితే హైదరాబాద్‌కు వచ్చే సమయంలో శంకర్ గౌడ్ నుంచి రతన్ రెడ్డి కోకెన్ తీసుకుని వచ్చాడని సమాచారం.

అయితే హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహిస్తున్న 8 మంది పాత్ర ఉందని విచారణలో తేలింది. పలు పబ్బుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకుల పాత్ర ఉందని చెప్పిన సందీప్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖుల పేర్లను వెల్లడించాడు. నగరంలోని పలు పబ్బుల్లో డ్రగ్స్ బిజినెస్‌పై కూడా ప్రదీప్‌ సమాచారం ఇచ్చాడంట.

అయితే శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఆ మూడు రోజుల పాటు ఒక ఎమ్మెల్యే పాల్గొన్నట్టు సమాచారం. ఇరానీ అమ్మాయిలతో కలిసి ఆయన కూడా డ్యాన్స్‌లు చేశాడని తెలిసింది. రాజశేఖర్, విక్కీ మల్హోత్ర డేనియల్, మస్తాన్ చంద్‌తో కలిసి పార్టీని ఎంజాయ్ చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించారు. రెండుసార్లు పంపిచినా హాజరు కాకపోడంతో తాజా నోటీస్‌కు స్పందించకుంటే కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు