దేశభక్తిని చాటేలా.. మిలటరీ నేపథ్యంలో కథ

18 Aug, 2022 15:21 IST|Sakshi

‘‘ఎమోషనల్, ఫ్యామిలీ, మిలటరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. మంచి కంటెంట్‌తో డీయస్‌ రాథోడ్‌ తీసిన ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్‌. నజీరుద్దీన్, సీతా మహాలక్ష్మీ జంటగా డీయస్‌ రాథోడ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భారత్‌ కీ నారీ’. అఖిల్‌ గంధం సమర్పణలో నమీర్‌ ఉద్దీన్‌ అహ్మద్‌ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని బెక్కం వేణుగోపాల్, ఫస్ట్‌ లుక్‌ని కల్నల్‌ రామారావు విడుదల చేశారు.

డీయస్‌ రాథోడ్‌ మాట్లాడుతూ– ‘‘దేశాన్ని కాపాడటానికి సైనికులు బాధ్యత వహించినట్లే వారి సతీమణులు కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు. ఈ చిత్రాన్ని దేశ సైనికుల సతీమణులకు, వారి తల్లితండ్రులకు అంకితం చేస్తున్నాం. సెప్టెంబర్‌ నెలాఖరులో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.  ‘‘మిలటరీ ఆఫీసర్‌గా నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు నజీరుద్దీన్‌. 

మరిన్ని వార్తలు