Satish Kaushik: నటుడు మరణించిన గదిలో లభ్యమైన మందులు.. పెరుగుతున్న అనుమానాలు

11 Mar, 2023 14:36 IST|Sakshi

బాలీవుడ్‌ దర్శకనిర్మాత, నటుడు సతీశ్‌ కౌశిక్‌ మరణంతో చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పటిదాకా హోలీ వేడుకల్లో మునిగి తేలిన ఆయన తన గదికి వెళ్లిన కొన్ని గంటల్లోనే మృత్యు ఒడికి చేరారు. దీంతో ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా ఆయన మరణించిన ఇంట్లో ఢిల్లీ పోలీసులు అనుమానాస్పద ఔషధాలను కనుగొన్నారు. అసలీ మందులు అక్కడికి ఎలా వచ్చాయి? సతీశ్‌ వాటిని వాడారా? వంటి అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఇటీవల జరిగిన హోలీ సెలబ్రేషన్స్‌ కోసం దాదాపు 10 నుంచి 12 మంది ఆ ఫామ్‌ హౌస్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో సతీశ్‌ కూడా పాల్గొన్నారు. వేడుక అనంతరం ఆయన ఫామ్‌హౌస్‌ లోపలకు వెళ్లిపోయారు. అంతలోనే ఆయనకు గుండెపోటుకు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఈ ఫామ్‌హౌస్‌ సతీశ్‌ మిత్రుడు, వ్యాపారవేత్త వికాస్‌ మాలుకు చెందినది. అతడు గతంలో అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆ కేసుకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు ఫామ్‌హౌస్‌లో మెడిసిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు వచ్చిన తర్వాతే సతీశ్‌ మరణానికి గల అసలు కారణంపై స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు