అమ్మ రాజ‌శేఖ‌ర్ కుళ్లు జోకులు మానేయండి

10 Sep, 2020 23:22 IST|Sakshi

హౌస్‌లో జ‌రుగుతున్న‌ అల్ల‌ర చివ్వ‌ర య‌వ్వారాల‌కు బిగ్‌బాస్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్ల‌తో ఫిజిక‌ల్ టాస్క్ ఆడించాడు. తొలిసారి టాస్క్ ఇచ్చాడు కాబ‌ట్టి, అంద‌రూ త‌మ శ‌క్తి మేర క‌ష్ట‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత బిగ్‌బాస్ దివికి ప్ర‌త్యేక‌ టాస్క్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా దివి వైద్య తానేం అనుకుంటుందో ఉన్న‌దున్న‌ట్టుగా అంద‌రి మొహం మీదే చెప్పింది. అయితే ఆమె చెప్పిన‌దాన్ని కొంద‌రు అంగీక‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఎలాంటి వాదులాట జర‌గ‌క‌పోవ‌డం విశేషం. నేటి ఎపిసోడ్‌లో జ‌‌రిగిన హైలెట్స్‌ను ప‌రిశీలిస్తే..

బిగ్‌బాస్ మార్నింగ్ మ‌స్తీలో దివికి టాస్క్ ఇచ్చాడు. త‌ను ఇంటిస‌భ్యుల‌ను ఏ విష‌యంలో మార్చాల‌ని అనుకుంటుందో చెప్పాల‌న్నాడు. దీంతో టాస్క్ ప్రారంభించిన దివి అఖిల్ మోడ‌ల్ అని‌.. అత‌ని వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. కాబ‌ట్టి అది మార్చుకుంటే మంచిది అని చెప్పింది. ప‌క్క‌వాళ్లు ఏడిస్తే క‌న్నీళ్లు పెట్టుకోవ‌ద్ద‌ని గంగ‌వ్వకు సూచించింది. ఏడ‌వ‌ద్దంటే తన వ‌ల్ల‌కాద‌ని గంగ‌వ్వ కాస్త క‌టువుగా స‌మాధాన‌మివ్వ‌గా, ఏడిస్తే తామెవ‌రం చూడ‌లేం అంటూ అవ్వ‌ను కూల్ చేశారు. ఆ త‌ర్వాత అభిజిత్‌.. కోపం త‌గ్గించుకుంటే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చింది. లాస్య సెన్సిటివ్ అని చెప్ప‌గా తాను అలాంటిదాన్ని కాన‌ని కొట్టిపారేసింది. హారిక అంద‌రినీ నువ్వు అని సంబోధిస్తుంది,  కాక‌పోతే కొంద‌రికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిదని చెప్పింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఫస్ట్‌ వీక్‌ నామినేషన్స్‌..)

మోనాల్ చిన్న‌దానికి కూడా ఏడుస్తుంద‌ని, కాబ‌ట్టి ప్ర‌తిదానికి ఏడ‌వ‌ద్ద‌ని సూచించింది. దేవి నాగ‌వ‌ల్లి అప్పుడే హైప‌ర్‌గా ఉంటారు, మ‌ళ్లీ అప్పుడే డ‌ల్ అయిపోతారు. కాబ‌ట్టి ఎన‌ర్జీ ఎప్పుడూ ఒకేలా ఉంచుకోవాలని తెలిపింది. నోయ‌ల్ పాయింట్ మాట్లాడుతున్నాడు. కాక‌పోతే అది ముందే ప్లాన్ చేసుకున్న‌ట్టు ఉంది. క‌ల్యాణి కొన్నిట్లో ఓవ‌ర్ చేస్తున్నారు. అది త‌గ్గించి, తొంద‌ర‌ప‌డ‌కుండా ఉంటే మంచిది. సూర్య కిర‌ణ్‌.. ప్ర‌తీది ప‌ర్‌ఫెక్ట్‌గా చెప్తున్నారు. కానీ నా మాట‌నే విన‌డం అనేది త‌గ్గించాలి అన‌గానే నేను త‌గ్గించ‌ను అంటూ ఒక్క‌సారిగా కోప్ప‌డిన‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చి న‌వ్వేశాడు. అమ్మ రాజశేఖ‌ర్‌.. అంద‌రికీ న‌చ్చిన ప‌ర్స‌న్‌. కానీ కుళ్లు జోకులు ఆపేస్తే మంచిదని చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: 'అత‌ను‌ ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించుకుంటే మంచిది')

ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ చెడ‌గొట్టిన క‌ట్ట‌ప్ప ఎవ‌రు?
ఆ త‌ర్వాత బిగ్‌బాస్‌.. అరియానా, సోహైల్‌ను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచాడు. క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పొడిచి నిన్న‌ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ను చెగ‌డొట్టాడ‌ని చెప్పాడు. ఇంటి స‌భ్యులు ఎవ‌రిని క‌ట్ట‌ప్ప అనుకుంటున్నారో, అందుకు కార‌ణాలేంటో తెలుసుకోవాల‌న్నాడు. అయితే ఇదే విష‌యాన్ని సోహైల్ ఇంటి స‌భ్యుల‌కు చెప్ప‌గా వారు ఈ మాట‌ల‌ను న‌మ్మ‌లేదు. ఇదేదో కొత్త టాస్క్ అని అనుమాన‌ప‌డ్డారు. నిన్న‌నే క‌ట్ట‌ప్ప ఎవ‌రనేది చీటీ రాసామ‌ని, ఇప్పుడు మ‌ళ్లీ కొత్త‌గా చెప్ప‌మ‌ని తేల్చి చెప్పారు. అయితే ఇంటి స‌భ్యుల ఆలోచ‌న‌ను క‌ట్ట‌ప్ప ప్ర‌భావితం చేస్తున్నాడ‌ని సూర్య‌కిర‌ణ్ గ్ర‌హించాడు. దీంతో అరియానా, సోహైల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అఖిల్ క‌ట్ట‌ప్ప అనుకుంటున్నాన‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత గంగ‌వ్వ కూడా అఖిల్ పేరే చెప్పింది. అమ్మ రాజశేఖ‌ర్‌.. నోయ‌ల్‌ పేరును, దివి, మెహ‌బూబ్‌.. లాస్య పేరు చెప్పారు. అస‌లు ఇంట్లో క‌ట్ట‌ప్ప ఎవ‌రూ లేర‌ని దేవి అభిప్రాయ‌ప‌డింది. కానీ మిగ‌తా ఇంటిస‌భ్యులు ఎవ‌రూ త‌మ అబిప్రాయాలు చెప్పేందుకు ముందుకు రాలేదు. ఆ త‌ర్వాత నోయ‌ల్ బిగ్‌బాస్ ర్యాప్ సాంగ్ పాడుతుంటే మిగ‌తా ఇంటి స‌భ్యులు చ‌ప్ప‌ట్లు కొట్టారు.

హౌస్‌లో ఫ‌స్ట్ ఫిజిక‌ల్ టాస్క్‌
బిగ్‌బాస్ ఫిజిక‌ల్ టాస్క్ ఇచ్చాడు. అరియానా, సోహైల్ క్వాలిటీ చెక్ మేనేజ‌ర్లుగా ఉండ‌గా, వారికి గంగ‌వ్వ అసిస్టెంటుగా వ్య‌వ‌హ‌రించింది. సూర్య కిర‌ణ్ సంచాల‌కుడుగా ప‌ని చేశాడు. మెహ‌బూబ్‌, దివి‌, దేవి ఎల్లో టీమ్‌, మోనాల్‌, లాస్య‌, అఖిల్ గ్రీన్‌ టీమ్‌, నోయ‌ల్‌, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఆరెంజ్ టీమ్‌, అభిజిత్‌, సుజాత‌, క‌ల్యాణి బ్లూ‌ టీమ్‌లుగా ఏర్ప‌డ్డారు. సైర‌న్ మోగ‌గానే గార్డెన్ ఏరియాలో క‌న్వేయ‌ర్ బెల్ట్ ద్వారా వ‌చ్చే వ‌స్తువుల కోసం టీమ్‌ స‌భ్యులు ఎగ‌బ‌డ్డారు. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అఖిల్ తెలివిగా ఆడ‌గా, అభిజిత్ ఆట‌లో కాస్త త‌డ‌బ‌డ్డాడు. నోయ‌ల్‌, లాస్య కూడా ట‌మాటాల కోసం కొట్టుకున్నంత ప‌ని చేశారు. మ‌రి ఈ ఆట‌లో ఎవ‌రు గెలిచారో రేపు తెలుస్తుంది. మ‌రోవైపు క‌ట్ట‌ప్ప ఎపిసోడ్ రేపు కూడా కొన‌సాగ‌నుంది. కాక‌పోతే క‌ట్ట‌ప్ప తానే అని నోయ‌ల్ ముందుకు రావ‌డం కొస‌మెరుపు. అది నిజ‌మేనా? ట‌్విస్టులు ఉన్నాయా? అనేది తెలియాలంటే రేప‌టివ‌ర‌కు ఆగాల్సిందే. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నోరు విప్పిన దివి వైద్య‌)

మరిన్ని వార్తలు