బిగ్‌బాస్‌: ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ

7 Sep, 2020 14:31 IST|Sakshi

కరోనా భయాలతో ఇళ్లకే పరిమితమైన జనాలకు వినోదం పంచేందుకు బిగ్‌బాస్‌ రెడీ అయ్యాడు. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-4 ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే, ఎప్పుడూ యువ సెలబ్రిటీలతో కనిపించే బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఈ సారి గంగవ్వ ఎంట్రీతో కొత్త శోభ సంతరించుకుంది. మై విలేజ్‌ షోతో పాపులరైన గంగవ్వ హౌజ్‌లోకి వచ్చీరాగానే ఇంటా, బయటా అభిమానులను సంపాదించుకుంది. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ షో చూడనివారు సైతం, ఈ సారి గంగవ్వ కోసం చూస్తామని సోషల్‌ మీడియాలో చెప్తున్నారు. ఆమెకు మద్దతుగా నిలుస్తామని అంటున్నారు.

ఇక హౌజ్‌లో తొలి ఎలిమినేషన్‌ ప్రక్రియను బిగ్‌బాస్‌ అప్పుడే షురూ చేశాడు. సోమవారం ఉదయం విడుదలైన ప్రోమో ద్వారా ఈ విషయం తెలుస్తోంది. నామినేట్‌ చేయాలనుకునే సభ్యుల పేర్లను చెప్పి, వారి మొహం మీద కిటీకి మూయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. సభ్యులందరిలో నామినేషన్‌ ఎదుర్కొనేందుకు చివరకు అభిజిత్‌, దేత్తడి హారిక మిగిలిపోయారు. అయితే, ఈ ఇద్దరి నామినేషన్‌కు సంబంధించి గంగవ్వ అభిప్రాయం చెప్పాల్సి ఉంది. ఈమేరకు జోర్దార్‌ సుజాత, యాంకర్‌ లాస్య ఎవరిని నామినేట్‌ చేస్తావని గంగవ్వను అడగ్గా.. ఆమె చెప్పిన డైలాగ్‌తో హౌజ్‌లో నవ్వులు పూశాయి. ‘ఎవరినీ నామినేట్‌ చేయొద్దు. ఇద్దరూ ఉండనీ’ అని గంగవ్వ తేల్చేసింది. మరి బిగ్‌బాస్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. (చదవండి: గంగవ్వకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శుభాకాంక్షలు)

మరిన్ని వార్తలు