బిగ్‌బాస్: గంగవ్వకు కండల వీరుడు స్పెషల్‌ గిఫ్ట్‌

18 Dec, 2020 16:58 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కోపం, ప్రేమ, ద్వేషం, గొడవలు,అలకలు, మనస్పర్థలు అన్నీ ఉంటాయి. ఒక్కో కంటెస్టెంట్స్‌ కొట్టుకునే రేంజ్‌లో గొడవ పడతారు కూడా. అయితే ఈ గొడవలు, కోపాలు కేవలం ఆటలో మాత్రమే ఉంటాయి. తర్వాత అంతా ఒక్కటైపోతారు.హౌస్‌లో శత్రువుల్లా మారినవారు సైతం​బయటకు వచ్చాక మిత్రులైపోతారు. ఇది గత మూడు సీజన్లలో చూస్తూ వచ్చాం. బిగ్ బాస్ లో గోడవలు ఎన్ని జరిగినా కూడా ఎక్కడో ఒక చోట కంటెస్టెంట్స్ మధ్య స్నేహ భావం అనేది ఉంటుంది.ఇక బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఇప్పటికే ఎలిమినేట్‌ అయిన సభ్యులంతా బయట కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటికెళ్లి కలుస్తున్నారు. గంగవ్వ ఇంటికి జోర్దార్‌ సుజాత వెళ్లి పలకరించింది. అలాగే లాస్య, నోయల్‌ కలిశారు. ఇలా ప్రతి కంటెస్టెంట్‌ మిగిలిన వారందరిని కలుసుకుంటు స్పెషల్ గా పార్టీలు కూడా చేసుకుంటున్నారు.

ఇక తాజాగా కండల వీరుడు మెహబూబ్ దిల్‌సే గంగవ్వతో పాటు జోర్దార్ సుజాతను ప్రత్యేకంగా ఇంటికి పిలిచాడు. మెహబూబ్ వారితో బిగ్‌బాస్‌కు సంబంధించిన సంగతులను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వించాడు. తన ఇంట్లో వారిద్దరికీ స్పెషల్‌ గా వంట చేసి పెట్టాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ పెట్టినట్లు వీరిద్దరికి ఒక గేమ్‌ పెట్టాడు మెహబూబ్‌. అద్దం లేకుండా మేకప్‌ వేసుకోవాలని సుజాత, గంగవ్వకు పోటీ పెట్టాడు. అందులో గంగవ్వ తనదైన శైలీలో మేకప్‌ వేసుకొని నవ్వులు పూయించింది. ఇక చివర్లో గంగవ్వకు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చాడు మెహబూబ్‌. ఆమె కోసం 25 తులాల పట్టీలను అందించారు.

గంగవ్వ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు పట్టీల స్టోరీ చెప్పింది. అప్పట్లో పొలం పని చేసేటప్పుడు పట్టీలు తీసి ఒక కుండలో దాచగా, ఆమె భర్తే తాగుడుకు అలవాటు పడి అమ్ముకున్నట్లు చెప్పింది. ఇక అప్పటి నుంచి కాళ్లకు పట్టీలు లేకుండానే ఉంటున్నానని ఒక సందర్భంలో చెప్పింది. అది గుర్తుపెట్టుకున్న మెహబూబ్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక పట్టీలను కానుకగా ఇచ్చి గంగవ్వను సర్‌ప్రైజ్‌ చేశాడు. మెహబూబ్‌ ఇచ్చిన గిఫ్ట్‌ చూసి ఆశ్చర్యపోయిన గంగవ్వ ఎమోషనల్ అయింది. మోహబూబ్‌ను దగ్గరికి పిలిచి హగ్‌ చేసుకుంది. ఇక మెహబూబ్, సుజాతకు స్వీట్స్  ప్రజెంట్ చేశాడు.

మరిన్ని వార్తలు