బిగ్‌బాస్‌: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?

21 Sep, 2020 23:07 IST|Sakshi

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 అంగరంగ వైభవంగా ఆరంభమై బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఆది నుంచి హుషారెత్తిస్తున్న బిగ్‌బాస్‌ మూడో వారం నుంచి కూడా అదే జోరు కనబరుస్తోంది. ఈ సీజన్ లో అంతా కొత్త కంటెస్టెంట్లు అయినప్పటికీ మంచి వినోదాన్ని, తమదైన ఎమోషన్స్‌ను పండిస్తున్నారు. ముఖ్యంగా విభిన్న జంటల మధ్య సాగుతున్న వ్యవహారం మరింత అసక్తిని కనబరుస్తుంది. అభిజిత్-మోనాలిక-అఖిల్ మరోవైపు అభిజిత్-హరిక, సుజాత-అభిజిత్, సోహెల్-అరియానా  జంట మధ్య లవ్ ట్రాక్స్ రక్తి కట్టిస్తున్నాయి. ఇలా ఎవరికి వాళ్లు మంచి వినోదాన్ని పండిస్తున్నారు. ఈ పరంగా చూస్తే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. 

 ఇక సోమవారం ఎపిసోడ్‌ చూసుకుంటే.. దేవి, లాస్య కిచెన్‌లో నవ్వుతూ ముచ్చట్లు  పెడుతుండగా, కూల్‌గా ఉండే అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ దేవిపై కోపానికి వచ్చాడు. దేవికి తనకు నచ్చినట్లు చేస్తోందని,తన గురించి చెడుగా చెబుతోందని అరియానా వద్ద చెప్పుకొచ్చాడు. సమయం సందర్భం లేకుండా నవ్వుతూ, ఏడుస్తూ, తను గెలవడానికి ఏదైనా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వారం ఇంట్లో రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా ఇంటి సభ్యూలందరూ కలిసి రేషన్‌ డీలర్‌గా ఏకగ్రీవంగా అభిజిత్‌ను ఎన్నుకున్నారు. మరో వైపు కిచెన్‌లో అఖిల్‌ కూర్చొని ఉండగా అక్కడకు వచ్చిన మోనాల్‌ తన చేతితో అఖిల్‌ కళ్లను మూయడంతో..అరియానా అని అఖిల్‌ చెప్పాడు. దీంతో నేను అరియానాలా కనిపిస్తున్నానా అని మోనాల్‌ కొంచెం ఫీల్‌ అయ్యింది. అయితే ఆ చేతులు అరియానాలా అనిపించాయని అఖిల్‌ సర్ది చెప్పుకొచ్చాడు.

ఇంతలో మూడో వారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటి సభ్యులందరూ ఒక్కొక్కరూ ఇద్దరిని చొప్పున నామినేట్‌ చేయాలి. ఇందుకు వారు మండుతున్న అగ్నిలో తాము నామినేట్‌ చేయాలి అనుకున్న హౌస్‌మేట్‌ ఫోటోను వేయాల్సి ఉంటుంది. అయితే ఈ వారం నోయల్‌ ఇంటి కెప్టెన్‌గా ఎన్నికవడంతో అతన్ని ఎవరూ నామినేట్‌ చేయడానికి వీలులేదు. నోయల్‌ మాత్రం ఒక్కరిని నామినేట్‌ చేయాలి. దీంతో అతడు లాస్యను నామినేట్‌ చేశాడు. అలాగే గతవారం ఎలిమినెట్‌ అయిన కరాటే కళ్యాణి బింగ్‌బాంబ్‌తో ఇప్పటికే దేవి డైరెక్ట్‌ నామినేట్‌ అవ్వడంతో ఆమెను కూడా ఎవరూ నామినేట్‌ చేయకూడదు.

అరియానా,సోహైల్‌ల మధ్య మాటల యుద్ధం
ఇక మిగిలిన వారిలో మోహబాబ్‌ అరియానా, హారిక ఫోటోలను అగ్నిలో వేయగా, దేవి- అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయిల ఫోటోలను కాల్చుతూ కారణాలను వివరించాడు. ఇలా హారిక- మెహబూబ్‌, సుజాత; అవినాష్‌- మెహబూబ్‌, హారిక; దివి- మోనాల్‌, కుమార్‌; అభిజిత్‌- అరియానా, సుజాత; సాయికుమార్‌- మోహబూబ్‌, అఖిల్‌; గంగవ్వ-మోనాల్, కుమార్‌; మోనాల్‌- దివి, అరియానా; అఖిల్‌- కుమార్‌;  సోహైల్‌- అరియానా, కుమార్‌; అమ్మ రాజశేఖర్‌- అరియానా, సాయికుమార్‌;  లాస్య- కుమార్‌, అరియానా; అరియానా- మోనాల్‌, మెహబూబ్‌; సుజాత- హారిక, అభిజిత్‌ ఫోటోలను అగ్నిలో వేశారు. 

ఈ సందర్భంగా సోహైల్, అరియానా మధ్య పెద్ద గొడవే జరిగింది. అరియానాను నామినేట్ చేస్తూ సోహైల్ కొన్ని కారణాలు చెప్పడంతోపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.  నీ గురించి ఏమిటో నాకు తెలుసని సోహైల్ అంటే.. నీ గురించి నాకు బాగానే తెలుసు అంటూ అరియానా ఘాటుగా జవాబిచ్చారు. నా గురించి మాట్లాడటం నన్ ఆఫ్ బిజినెస్ అంటూ ఒకరిపైఒకరు గట్టిగా అరుచుకున్నారు. అలాగే అఖిల్ , కుమార్ సాయి మధ్య కూడా భారీగా మాటల యుద్దం జరిగింది. ఇంటి సభ్యుల్లో అత్యధికంగా మెహబూబ్‌, అరియానా, కుమార్‌, మోనాల్‌, హారిక ఫోటోలను అగ్నిలో వేయడంతో వీరంతా ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు. ఇక ఇప్పటికే నామినేట్‌ అయిన లాస్య, దేవిలతో కలిసి ఈ వారం మొత్తం ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారని బిగ్‌బాస్‌ ప్రకటించారు. మరి ఈ ఏడుగురిలో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు