Bigg Boss Telugu 5: శ్రీరామ్‌, సిరి అంత నొప్పి ఎలా భరించారో?

22 Dec, 2021 20:22 IST|Sakshi

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ముగిసింది. అందులో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లకు సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. పాపులారిటీతో పాటు ఆఫర్లు కూడా తలుపు తడుతుండటం నిజంగానే శుభపరిణామం. మరీ ముఖ్యంగా టాప్‌ 5కి చేరుకున్న ఫైనలిస్టులు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా మారారు. ఈ క్రమంలో శ్రీరామచంద్ర, సిరి పాదాలను చూసి అభిమానులు షాకవుతున్నారు. పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి. ఇంత బాధను పంటికింద భరించి బయటకు మాత్రం ఎలా నవ్వుతూ ఉన్నారని నెటిజన్లు వారిని కొనియాడుతున్నారు.

కాగా టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ ఇచ్చిన ఐస్‌ టాస్క్‌ వారి అనారోగ్యానికి కారణమైంది. ఎక్కువ సేపు ఐస్‌ వాటర్‌లో ఉండటం వల్ల సిరి కాళ్లు చెడిపోయి నడవలేని స్థితికి చేరుకుంది. మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రియాంక.. శ్రీరామ్‌ పాదాలకు వేడినీళ్లు పోసి బామ్‌ రాయడంతో అతడు మంచానికే పరిమితమయ్యాడు. వీళ్లు నడవలేకపోతున్నారని చూపించాడే కానీ పాదాలకు బొబ్బలు వచ్చిన దృశ్యాలను మాత్రం ప్రేక్షకుల కంటపడనీయలేదు బిగ్‌బాస్‌.

దీంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు బిగ్‌బాస్‌ టీమ్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. శ్రీరామ్‌, సిరిల పాదాలకు బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోయిన విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాస్కుల పేరుతో కంటెస్టెంట్లను మరీ ఇంతలా హింసిస్తారా? అని విమర్శిస్తున్నారు. సిరి, శ్రీరామ్‌ల పరిస్థితిని తలుచుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు. వీరి బాధను కళ్లకు కట్టినట్లు చూపించి ఉండుంటే సానుభూతి ఓట్లయినా పడేవి కదా అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

A post shared by Sreerama Chandra (@sreeramachandra5)

మరిన్ని వార్తలు