Bigg Boss Telugu 5: ప్రియాంక.. ఇవే తగ్గించుకుంటే మంచిది: మానస్‌

5 Dec, 2021 10:20 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 91: బిగ్‌బాస్‌ హౌస్‌లో ర్యాంప్‌ వాక్‌ జరగ్గా దీనికి శ్రీరామ్‌, సిరి జడ్జిలుగా వ్యవహరించారు. వీరు కాజల్‌, షణ్నును విజేతలుగా ప్రకటించారు. తర్వాత నాగార్జున ఇంటిసభ్యులను పలకరిస్తూనే హౌస్‌లో ఎవరిమీదైనా ఫిర్యాదులుంటే చెప్పాలని ఆదేశించాడు. సన్నీ సిరి మీద కంప్లైంట్‌ ఇవ్వగా సిరి, మానస్‌ షణ్ను మీద పింకీ.. సన్నీ మీద ఫిర్యాదు చేశారు. కాజల్‌.. సన్నీ తన మనసు ముక్కలు చేశాడని ఆరోపించింది. రెండు రోజులుగా తాను చాలా బాధపడుతున్నానని తెలపడంతో సన్నీ అందరి ముందే ఆమెకు సారీ చెప్పాడు.

నాగార్జున.. తనకు కూడా హౌస్‌మేట్స్‌పై ఫిర్యాదులు ఉన్నాయంటూ ముందుగా ప్రియాంకను నిల్చోబెట్టాడు. సొంత వైద్యం వద్దని బిగ్‌బాస్‌ మరీమరీ చెప్పినప్పటికీ కాళ్లకు బామ్‌ రాసి వేడినీళ్లు పోసి శ్రీరామ్‌ను నడవలేని దుస్థితికి తీసుకొచ్చావని నిందించాడు. నువ్వు డాక్టర్‌వి కాదని కాబట్టి ఇలా సొంత వైద్యం చేయొద్దని హెచ్చరించగా పింకీ కంట నీరు పెట్టుకుంది. శ్రీరామ్‌ మీద కూడా ఫిర్యాదు ఉందన్నాడు నాగ్‌. నీ తరపున షణ్ను గేమ్‌ ఆడుతున్నప్పుడు అతడి మీద నమ్మకముంచాలని శ్రీరామ్‌కు సూచించాడు. అలాగే మానస్‌ మీద కూడా ఓ ఫిర్యాదు ఉందన్న నాగ్‌.. ఒక గేమ్‌లో నీకు నువ్వు 29 నిమిషాలు సరిగ్గా కౌంట్‌ చేసుకున్నప్పుడు సన్నీకి మాత్రం తప్పుగా ఎలా లెక్కించావని ప్రశ్నించాడు. అయితే మానస్‌ మాత్రం తాను అది కావాలని చేయలేదని బదులిచ్చాడు.

టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లోని ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌లో సన్నీ, సిరి ఇద్దరూ తొండి ఆట ఆడారని నాగ్‌ వీడియోలతో సహా నిరూపించడంతో అందరూ పగలబడి నవ్వేశారు. ఫోకస్‌ టాస్క్‌లో గట్టిగట్టిగా అరుస్తూ అందరినీ డిస్టర్బ్‌ చేయడం తప్పని కాజల్‌కు చురకలంటించాడు. తర్వాత శ్రీరామ్‌కు సన్నీ, షణ్ను చేతుల మీదుగా ఫస్ట్‌ ఫైనలిస్టు ట్రోఫీని అందజేశారు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఎమోజీ గేమ్‌ ఆడించాడు నాగ్‌. ఈ గేమ్‌లో పంచ్‌, షటప్‌, కోపం ఎమోజీలతో ఉండే మూడు దిండ్లను ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో శ్రీరామ్‌.. సన్నీకి పంచ్‌ ఇవ్వగా కాజల్‌కు నోరు మూయమనే ఎమోజీ ఇచ్చాడు. ప్రియాంక వల్ల నడవలేకపోతున్నానని ఆమె మీద చిరు కోపాన్ని ప్రదర్శించాడు.

సన్నీ.. ​కాజల్‌ను నోరు మూయమన్నాడు. సిరి మీద కోపంగా ఉందన్నాడు. షణ్నుకు పంచ్‌ ఇస్తూ అతడు నవ్వితే బాగుంటుందన్నాడు. షణ్ను.. కాజల్‌ మీద కోపంగా ఉందన్నాడు. సిరి తల మీద ఒక్క పంచ్‌ ఇస్తే ఆమె బ్రెయిన్‌ సరిగా పని చేస్తుందన్నాడు. ఉచిత సలహాలు ఇవ్వకుండా నోరు మూసుకోమని ప్రియాంకకు సూచించాడు.  తర్వాత ప్రియాంక వంతు రాగా ఆమె సిరికి పంచ్‌ ఇచ్చింది. సన్నీ మీద కోపంగా ఉందని పేర్కొంది. కోపంలో నన్ను ఏదైనా అనేస్తాడంటూ మానస్‌ను కాస్త నోరు మూసుకోమని చెప్పింది. 

మానస్‌.. సిరి మీద కోపంగా ఉందంటూ సన్నీకి పంచ్‌ ఇచ్చాడు. కోపంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కొంచెం తగ్గించుకుంటే మంచిదని పింకీకి సలహా ఇచ్చాడు. కాజల్‌.. శ్రీరామ్‌కు పంచ్‌ ఇవ్వగా షణ్ను మీద కోపంగా ఉందని తెలిపింది. నేను చెప్తున్నప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకుని వినాలని సన్నీకి సెలవిచ్చింది. సిరి.. ఇంకోసారి నిన్నే టార్గెట్‌ చేశానంటే కొడతానని, ఆ మాట మాట్లాడద్దంటూ సన్నీని నోరు మూసుకోమని వార్నింగ్‌ ఇచ్చింది. షణ్నుకు పంచ్‌ ఇచ్చింది. ప్రియాంక సింగ్‌ మీద కోపంగా ఉందని పేర్కొంది.

అనంతరం నాగార్జున గతంలో ఫ్యామిలీ మెంబర్స్‌ కోసం హౌస్‌మేట్స్‌ త్యాగాలు చేసిన సామానంతా తిరిగిచ్చేయడంతో వాళ్లు తెగ సంతోషించారు. కానీ సిరి, ప్రియాంక త్యాగం చేసిన వస్తువులు మాత్రం తిరిగి రాలేదు. వీళ్లిద్దరి వస్తువులు కూడా తిరిగి రావాలంటే మిగతా హౌస్‌మేట్స్‌ త్యాగం చేయాలని మెలిక పెట్టాడు నాగ్‌. హౌస్‌లో ఎవరు ఉండటానికి అర్హత ఉందనుకుంటున్నారో వారికే త్యాగం చేయాలన్నాడు. అందులో భాగంగా తులాభారంలో సిరి, ప్రియాంకలలో ఎవరి వైపు ఎక్కువ బరువు తూగితే వారు త్యాగం చేసిన వస్తువు తిరిగొస్తుందన్నాడు.

దీంతో సన్నీ, మానస్‌ పింకీకి సపోర్ట్‌ చేయగా మిగతావాళ్లు సిరికి సపోర్ట్‌ చేశారు. తులాభారంలో సిరి వైపు ఎక్కువ బరువు తూగడంతో శ్రీహాన్‌ ఆమెకిచ్చిన గిఫ్ట్‌ తిరిగి వచ్చింది. ఈరోజు శ్రీరామ్‌ మినహా మానస్‌, సిరి, కాజల్‌, ప్రియాంకలలో ఎవరినీ సేవ్‌ చేయలేదు నాగ్‌.

మరిన్ని వార్తలు