Bigg Boss: గీతూ కన్నింగ్‌ ప్లాన్‌.. కాలితో తన్నిన ఇనయా, నేహాకు చెంపదెబ్బ!

22 Sep, 2022 09:24 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ జరుగుతోంది. ‘అడవిలో ఆట’ పేరిట జరుగుతున్న ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు.ఒక టీమ్‌ పోలీసులుగా వ్యవహరించనుండగా, రెండో టీమ్‌ దొంగలుగా ఉన్నారు. గీతూ రాయల్‌ మాత్రం స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా ఉంటోంది. అయితే టాస్క్‌లు రెండు టీమ్‌లు సభ్యులు బిగ్‌బాస్‌ రూల్స్‌ని బ్రేక్‌ చేశారు. వస్తువులను కాపాడాల్సిన పోలీసులే.. అడవిలోని విలువైన వస్తువులను దొంగతనం చేశారు. ఇక వస్తువులను కొనాల్సిన గీతూ కూడా కొన్నింటిని కొట్టేసింది.దీంతో బిగ్‌బాస్‌ మరోసారి టాస్క్‌ గురించి వివరించాడు. 

రైడ్‌కి వెళ్లిన పోలీసులు సమయానికి మించి అక్కడే ఉంటే..వారిని దొంగలు కిడ్నాప్‌ చేయ్యొచ్చు. ఈ కండీషన్‌పై స్టోర్‌ రూంలోకి వెళ్లిన ఇనయాను దొంగలు కిడ్నాప్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఇద్దరు దొంగలు మాత్రమే ఇనయాను కిడ్నాప్‌ చేయాల్సి ఉండగా.. అందరూ వచ్చి ఆమెను పట్టుకున్నారు. తనను తాను తప్పించుకునే క్రమంలో ఇనయా.. ఆరోహిని కాలితో తన్నడంతో పాటు నేహ చెంపపై కొట్టింది. గుండెల మీద పట్టుకొని బయటకు నెట్టి చెంపపై కొట్టిందని రేవంత్‌తో చెబుతూ నేహా బాధ పడుతుంటే..షూతో ఆరోహి మొహం మీద తన్నిందని రేవంత్‌ చెప్పాడు.

ఇక ఇదే విషయంపై కీర్తి, ఇనయా మధ్య డిస్కషన్‌ జరిగింది. నేను రైడ్‌కి వెళ్లే సమయంలో నేహ బెడ్‌ రూమ్‌లో ఉందని ఇనయా అంటే..లేదని కీర్తి చెప్పింది..ఇలా ఇద్దరు గొడవపడుతుంటే.. చంటి కలగజేసుకొని ఆ సమయంలో నేహ బెడ్‌ రూమ్‌లో లేదని చెప్పడంతో అందరూ కూల్‌ అయిపోయారు. గీతూ, ఇనయాల మధ్య కూడా కిడ్నాప్‌ గురించే గొడవ జరిగింది. ఆ సమయంలో దొంగల టీమ్‌లోని సభ్యులెవరో తన డ్రెస్‌ని పైకి లాగారని ఇనయా అంటే.. ఇవన్నీ తప్పుడు మాటలని గీతూ మొహం మీదే చెప్పేసింది.‘నువ్ తప్పు మాటలు మాట్లాడుతున్నావ్.. మాటలు మారుస్తున్నావ్ ’అంటూ ఇనయాను రెచ్చగొట్టింది. చివరకు ఇనయా నేను చేసిందే తప్పే..కానీ వాళ్లు చేసింది ఎంతవకు కరెక్ట్‌? అని చెబుతూనే.. కిడ్నాప్‌ చేసుకోండి అని ఇంట్లోకి వెళ్లింది.

‘అడవిలో ఆట’ టాస్క్‌లో ఎలాగైనా గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌ కావాలని గీతూ కన్నింగ్‌ ప్లాన్‌ వేసింది. తను కొనుగోలు చేసిన బొమ్మలను కాపాడుకునేందుకు సూర్య, శ్రీహాన్‌లతో డీల్ కుదుర్చుకుంది. అయితే గీతూ ఇచ్చిన డబ్బులను శ్రీహాన్‌ తీసుకున్నాడు కానీ.. సూర్య మాత్రం తీసుకోలేదు. ఇక దొంగల టీమ్‌ సభ్యుడైన రేవంత్‌పై ఆ టీమ్‌ సభ్యులే అనుమానం వ్యక్తం చేశారు. గీతూతో రేవంత్‌ డీల్‌ కుదుర్చుకున్నాడని, అతని బొమ్మలు లేపేద్దామని నేహా, ఆరోహి ప్లాన్‌ వేశారు. అనుకున్నట్లే రేవంత్‌ దాచుకున్న బొమ్మలను దొంగిలించారు. దీంతో రేవంత్‌ కోపంతో ఊగిపోయాడు. తన బొమ్మలను లేపేసిన వారికి సిగ్గూ శరం లేదంటూ మండిపోయాడు.

నీతులు చెప్పడమే కాదు పాటించాలి కూడా అంటూ దొంగల టీమ్‌పై అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా రాత్రంతా నిద్ర పోనని, పోలీసుల టీమ్‌ని గెలించడమే తన లక్ష్యమని చెప్పాడు. బుధవారం నాటి ఆట ముగిసే సరికి.. శ్రీహాన్, సూర్యల వద్దే ఎక్కువ డబ్బులున్నట్టు కనిపిస్తోంది.అలాగే గీతూ కూడా తనకు కావాల్సిన బొమ్మలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. 

మరిన్ని వార్తలు