Bigg Boss: కంటెస్టెంట్లు షోను బోర్‌ కొట్టిస్తున్నారు!

27 Aug, 2021 11:13 IST|Sakshi

బిగ్‌బాస్‌ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌. బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఈ రియాలిటీ షోను ఎప్పటికప్పుడు గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తుంటారు నిర్వాహకులు. గత సీజన్లను మించిపోయేలా రెట్టింపు వినోదాన్ని అందించాలని ఉవ్విళ్లూరుతుంటారు. బిగ్‌బాస్‌ హౌస్‌ డిజైన్‌ దగ్గర నుంచి కంటెస్టెంట్ల ఎంపిక వరకు ప్రతీది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ మధ్యే హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ వైభవంగా ప్రారంభమైంది. ఈసారి సల్మాన్‌ ఖాన్‌ స్థానంలో కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వూట్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈసారి కంటెస్టెంట్లు పరమ బోర్‌ తెప్పిస్తున్నారంటోంది బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌. కేవలం నిద్రపోవడానికే కొందరు బిగ్‌బాస్‌ షోకు వెళ్లారని పెదవి విరుస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది కంటెస్టెంట్లు అది చేస్తాం, ఇది చేస్తాం అని బీరాలు పలుకుతూ హౌస్‌లోకి వెళతారు. కానీ అక్కడికి వెళ్లాక అందరూ బొక్క బోర్లా పడతారు. ఈసారి హౌస్‌లో అడుగు పెట్టిన సింగర్‌ నేహా భాసిన్‌ అయితే షోలో ఎందుకూ పనికి రాకుండా పోయిందని విమర్శించింది.

మరో ఇద్దరు కంటెస్టెంట్లు మిలింద్‌, రాకేశ్‌ నిద్ర పోవడానికే షోకి వచ్చినట్లుందని, కరోనా వల్ల ఈ రెండేళ్లు నిద్రపోలేదా అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వారు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి గేమ్‌ ఆడితే బాగుంటుందని చురకలంటించింది. ఈ ఇద్దరూ వేరేవాళ్ల గొడవలో తలదూర్చరని, పోనీ వాళ్లైనా గొడవపడతారా? అంటే అదీ లేదని.. అసలు వీళ్లు ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం అందించట్లేదని పెదవి విరిచింది. 

మరిన్ని వార్తలు