Bigg Boss 5 Telugu: పిట్ట కొంచెం కూత ఘనం.. నచ్చిన ఫొటో చేజార్చుకున్న సిరి!

15 Dec, 2021 23:49 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 102: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు ఏం చేయాలో పాలు పోక దాగుడుమూతలు ఆడుకున్నారు. కాసేపు ఆడుకున్న తర్వాత మానస్‌ సన్నీ ముచ్చట్లు పెట్టుకున్నారు. మానస్‌ మాట్లాడుతూ.. శ్రీరామ్‌ ఆట తనకు నచ్చదని చెప్పాడు. అన్నీ ఆలోచించి ఆడతాడని అభిప్రాయపడ్డాడు. అనంతరం సిరికి తన జర్నీ చూసే అవకాశం లభించింది. ఈ క్రమంలో తన ఫొటోలన్నింటిని చూసుకుని తెగ మురిసిపోయింది.

'అల్లరి పిల్లగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సిరిగా మీరు అందరికీ పరిచయం. కానీ ఎంతో ధైర్యంగా ఉండే సిరిలో జరుగుతున్న సంఘర్షణ వల్ల మీరు కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎంచుకునేలా చేశాయి. మీ కన్నీళ్లు మౌనంగా ఆ విషయాన్ని చెప్పాయి. కానీ మీ నవ్వు చేసిన సందడిలో కన్నీళ్లు ఇంకిపోయాయి. పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాట మీ విషయంలో నిజమైంది. ఈ బిగ్‌బాస్‌ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరి మీరు' అంటూ బిగ్‌బాస్‌ ఆమెను ఆకాశానికెత్తారు. తర్వాత ఆమె జర్నీ వీడియో చూపించడంతో సిరి ఎమోషనల్‌ అయింది. మరీ ముఖ్యంగా చోటు కనిపించగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

తర్వాత సిరి దొరికిందే ఛాన్స్‌ అని ఐదారు ఫొటోలు తీసుకొచ్చేసింది. షణ్నుతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఫొటో కూడా పట్టుకొచ్చింది కానీ సర్‌ప్రైజ్‌ ఇద్దామని దాన్ని డైనింగ్‌ టేబుల్‌పై దాచిపెట్టింది. ఇంతలో బిగ్‌బాస్‌ అక్కడున్న సెట్‌నంతా తొలగించే క్రమంలో ఆ ఫొటోను కూడా మాయం చేయడంతో సిరి నిరాశపడింది. జర్నీ వీడియోలో మనిద్దరం కంటెంట్‌ ఇవ్వడానికే వచ్చాం అని మానస్‌ అన్నాడంటూ షణ్నుకు చెప్పింది సిరి. దీంతో ఆగ్రహించిన షణ్ను.. ఇందుకే వాళ్ల సాయం తీసుకోవద్దంటాను అని హితవు పలికాడు.

అనంతరం బిగ్‌బాస్‌.. టాప్‌ 5లో నిలిచిన కంటెస్టెంట్లను వారి మరపురాని క్షణాలను పంచుకోవాలని సూచిస్తూనే అక్కడున్న కొన్ని ఫొటోలను బిగ్‌బాస్‌కు ఇవ్వాలని చెప్పాడు. ముందుగా మానస్‌ మాట్లాడుతూ.. టెడ్డీబేర్‌ టాస్కులో గెలిచినప్పుడు నేను, సన్నీ, యానీ మాస్టర్‌ను సంతోషంతో ఎత్తుకున్నాం.. అంటూ ఆ ఫొటోను బిగ్‌బాస్‌కిచ్చాడు. షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ జర్నీలోనే బాధాకరమైన విషయం అమ్మ లెటర్‌ ముక్కలు కావడం అంటూ దానికి సంబంధించిన ఫొటోను బోర్డుపై పెట్టాడు. సిరి వంతు రాగా 'బ్రిక్స్‌ ఛాలెంజ్‌ కంటే ముందు షణ్నుకు, నాకు గొడవ అయింది. ఫేక్‌ ఫ్రెండ్‌ అని తిట్టాను కానీ అది తప్పని ఈ టాస్క్‌తో రుజువైంది. ఈ జర్నీ మొత్తంలో నాకు అండగా నిలిచింది షణ్ను ఒక్కడే' అని చెప్పుకొచ్చింది.

శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ఈ ఇంట్లో నాకు మంచి బాండ్‌ కుదురిన ఫస్ట్‌ పర్సన్‌ హమీదా. ఆమె వెళ్లిపోయాక చాలా బాధేసింది. చాలా మిస్‌ అవుతున్నాను, ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఈమె ఉండుంటే లోన్‌ రేంజర్‌ అన్న ట్యాగ్‌ వచ్చేది కాదని ఫీలడు. తర్వాత సన్నీ వంతురాగా.. బేటన్‌ టాస్కులో నా టీమ్‌ వాళ్లే నన్ను వరస్ట్‌ పర్ఫామర్‌ అన్నారు. అప్పుడు జైల్లో పడి బాధపడితే మానస్‌ కూడా ఏడ్చాడు అని చెప్పుకొచ్చాడు. అందరినీ నవ్వించడమే తన నినాదంగా పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు